రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉంది: సీజేపీ ప్రతినిధి
ABN , Publish Date - Jul 24 , 2026 | 03:27 PM
నీట్ పేపర్ లీక్కు కేంద్రం బాధ్యత తీసుకోవాలంటూ పట్టుబడుతున్న సీజేపీ ప్రతినిధులు కొందరు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్లతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను కేంద్రం ముందుంచినట్టు సీజేపీ ప్రతినిధులు చెప్పారు. కొన్నింటిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్కు కేంద్రం బాధ్యత తీసుకోవాలంటూ పట్టుబడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు కొందరు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేందర్ సింగ్లతో సమావేశమయ్యారు. నీట్ సహా విద్యా వ్యవస్థలో కీలక అంశాలపై చర్చించారు. దాదాపు గంటన్నరపాటు ఈ చర్చలు జరిగాయి. తమ డిమాండ్లను సీజేపీ లిఖితపూర్వకంగా ప్రభుత్వం ముందుంచింది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. పేపర్ లీక్ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటుకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించాలని స్పష్టం చేశారు. ఇందుకు కేంద్ర మంత్రులు స్పందింస్తూ తమకు ఒక రోజు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో, రేపు మరోసారి భేటీ అయ్యేందుకు ఇరు వర్గాలు నిర్ణయించాయి.
కేంద్రం మంత్రులతో సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ముందు 3 ప్రధాన డిమాండ్లు పెట్టామని సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ తెలిపారు. మూడింట్లో రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉందని అన్నారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని తాము కోరినట్టు చెప్పారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి రేపటి వరకు కేంద్రం గడువు కోరిందని సౌరభ్ దాస్ చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
NEET-UG సంస్కరణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
విద్యార్థులను బెదిరించే హక్కు మీకెవరిచ్చారు?.. డీయూపై రాహుల్ గాంధీ ఫైర్..