భారీ వర్షాల ఎఫెక్ట్.. చార్ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
ABN , Publish Date - Jul 28 , 2026 | 02:20 PM
భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఉత్తరాఖండ్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు, వరుసగా విరిగిపడుతున్న కొండచరియల కారణంగా చార్ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు, వరుసగా విరిగిపడుతున్న కొండచరియల కారణంగా చార్ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మంగళ, బుధవారం రోజుల్లో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో యాత్రా మార్గాలు దెబ్బతినడంతో పాటు రహదారులపై భారీగా రాళ్లు, మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించిన తర్వాత, రహదారులను శుభ్రపరిచి సురక్షితమని నిర్ధారించిన అనంతరం యాత్రను తిరిగి ప్రారంభిస్తామని గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వెల్లడించారు.
ముంకటియా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో కేదార్నాథ్ హైవే పూర్తిగా మూసివేయబడింది. రహదారిపై పడిన భారీ శిలలు, రాళ్లు, మట్టిని తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన భారీ యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా యంత్రాంగం యాత్రికుల భద్రత కోసం అన్ని అవసరమైన చర్యలు చేపట్టగా, యాత్ర నియంత్రణ కేంద్రం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సెక్టార్ అధికారులు, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ యాత్రికులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నాయి. అధికారులు అనుమతి ఇచ్చే వరకూ.. ఎవరూ యాత్రకు బయలుదేరవద్దని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని యాత్రికులకు సూచించారు.
ఇవి కూడా చదవండి
29 వేల రేషన్ దుకాణాలు మరింత బలోపేతం: మంత్రి నాదెండ్ల
అవసరమైతే మిమ్మల్ని కూడా వ్యతిరేకిస్తా.. రాహుల్ గాంధీతో జెన్ జీ నిరసనకారుడు ఇర్ఫాన్