బీజేపీలో చేరేలా ఎవరినైనా 2 గంటల్లో ఒప్పిస్తా
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:43 AM
ఎవరినైనా బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తనకు రెండు గంటలు చాలని బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. ఇటీవల పలువురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తిరుగుబాటు...
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను నేను ప్రలోభ పెట్టలేదు
గతంలో వారు నా కుమారుడి వివాహానికి సైతం వచ్చారు
వారితో స్నేహబంధం ఉంది: బీజేపీ ఎంపీ సీఎం రమేశ్
న్యూఢిల్లీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఎవరినైనా బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తనకు రెండు గంటలు చాలని బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. ఇటీవల పలువురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరేలా ప్రోత్సహించడం వెనుక సీఎం రమేశ్ చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒక జాతీయ పత్రికతో ఆయన మాట్లాడుతూ తనకు చాలా కాలం నుంచి తృణమూల్ ఎంపీలు తెలుసని, వారితో ఒక బంధం ఏర్పడిందని తెలిపారు. 2020లో దుబాయి, హైదరాబాద్లో జరిగిన తన కుమారుడి వివాహ వేడుకలకు సైతం వారు హాజరయ్యారని గుర్తు చేశారు. తృణమూల్ ఎంపీలను ఆకర్షించేందుకు డబ్బు పంపిణీ జరగలేదని, పదవులు ఇస్తామంటూ ప్రలోభం పెట్టలేదని తెలిపారు. కాగా, గతంలో అస్సోంకు చెందిన కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా.. రాత్రికి రాత్రి బీజేపీలో చేరడంలో రమేశ్ పాత్ర ఉందని గుసగుసలు వినిపించాయి. అమిత్ షా ఆదేశాలతో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలోనూ బీజేపీ సభ్యులను గెలిపించేందుకు సీఎం రమేశ్ తీవ్రంగా కృషి చేశారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.