కాశీ యాత్రకని బయలుదేరిఅనంతలోకాలకు
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:24 AM
కాశీయాత్రకని బయలుదేరిన బృందం రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందగా 13మంది గాయపడ్డారు.
టెంపో ట్రావెలర్ను ఢీకొన్న లారీ
ముగ్గురు మహిళల దుర్మరణం..13మందికి గాయాలు
బెంగళూరు ఎయిర్పోర్టుకు వెళుతుండగా ప్రమాదం
బెంగళూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కాశీయాత్రకని బయలుదేరిన బృందం రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందగా 13మంది గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా తిపటూరుకు చెందిన 15మంది మహిళలు కాశీయాత్రకు వెళ్లేందుకు శనివారం రాత్రి పొద్దుపోయాక టెంపో ట్రావెలర్ వాహనంలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు బయల్దేరారు. ఆదివారం ఉదయం 6 గంటలకు కాశీ వెళ్లే విమానం ఎక్కాల్సి ఉంది. తిపటూరు నుంచి ఎయిర్పోర్ట్కు వస్తుండగా దేవనహళ్లి సమీపాన ఎస్టీఆర్ఆర్పై రాణిక్రాస్ వద్ద టీటీ వాహనం యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన లారీ ఢీ కొంది. దీంతో టెంపో ట్రావెలర్ ఓవైపు పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో తిపటూరు పట్టణం విద్యానగర్కు చెందిన జయమ్మ (65), యశోదమ్మ (60), గంగా (40) మృతి చెందారు. మిగిలిన 12మందితోపాటు డ్రైవర్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దేవనహళ్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.