యూపీలో పొత్తుకు సిద్ధమే: ఒవైసీ
ABN , Publish Date - Jul 26 , 2026 | 02:09 PM
యూపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇతరులతో జట్టు కట్టేందుకు తాను సిద్ధమేనని అన్నారు. చర్చలకు ఇదే సమయమని, ఆలస్యం కాకముందే స్పందించాలని సమాజ్వాదీ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మొరాదాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ ఈ కామెంట్స్ చేశారు.
‘యూపీలో మళ్లీ బీజేపీ అధికారంలోని రావాలని మజ్లిస్ పార్టీ కోరుకోవట్లేదు. కాబట్టి ఇతరులతో చేతులు కలిపేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. కూటమి ఏర్పాటుకు నేను రెడీనే. చర్చలకు ఇదే సమయం. ఎన్నికలయ్యే వరకూ జాప్యం చేసి ఆ తరువాత బాధపడొద్దు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘నేను పోటీ చేస్తే మీకు నష్టం జరుగుతుందని అంటున్నారుగా. కాబట్టి మీతో కలిసి పోరాడేందుకు నేను సిద్ధం. న్యాయం, గౌరవం కోసమే మేము పోరాడుతున్నాము. మాకు సమానత్వం కావాలి. అఖిలేష్ ఒక కుర్చీపై కూర్చుంటే నేను ఎదురుగా మరో కుర్చీపై దర్జాగా కూర్చుని హక్కులు, న్యాయం గురించి మాట్లాడతా’ అని ఒవైసీ అన్నారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
ఈ కామెంట్స్పై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఓటు బ్యాంకు రాజకీయాలు అంటే ఇవేనని ఎద్దేవా చేసింది. ఒవైసీ, అఖిలేష్ యాదవ్ ఇద్దరు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి ప్రహ్లాద్ జోషి
అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ