ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
ABN , Publish Date - Aug 08 , 2026 | 03:00 PM
ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల రహదారులు కుంగిపోవడం, పగుళ్లు ఏర్పడటం వంటి సమస్యలు ప్రయాణికులను తీవ్రంగా వేధిస్తున్నాయి. మొన్న లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన కొన్ని రోజులకే పగుళ్లు ఏర్పడగా.. తాజాగా ఆగ్రాలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది.
ఆగ్రా: ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల రహదారులు కుంగిపోవడం, పగుళ్లు ఏర్పడటం వంటి సమస్యలు ప్రయాణికులను తీవ్రంగా వేధిస్తున్నాయి. మొన్న రూ.4,200 కోట్లతో నిర్మించిన లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన కొన్ని రోజులకే పగుళ్లు ఏర్పడగా.. తాజాగా ఆగ్రాలోని కమలా నగర్ ప్రాంతంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డు కుంగిపోయి ఏకంగా పెద్ద గుంతే ఏర్పడింది. ప్రమాద సమయంలో ఆ రహదారిపై వాహనాలు వెళ్లకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని అటువైపుగా వాహనాలు వెళ్లకుండా నియంత్రించారు.
అయితే, రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడిన కమలా నగర్ ప్రాంతానికి సమాజ్వాదీ పార్టీ నాయకుడు నితిన్ కోహ్లీ చేరుకున్నారు. తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చిన ఆయన.. నిచ్చెన సహాయంతో గుంతలోకి దిగారు. అక్కడే నిలబడి ప్రభుత్వం, అధికారులపై విమర్శలు గుప్పించారు. వర్షాకాలంలో పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కోహ్లీ మండిపడ్డారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో తీవ్ర అవినీతి జరుగుతోందని, అందుకే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని కోహ్లీ ఆరోపించారు.
ఆగ్రా నగరాన్ని గుంతల నగరంగా మార్చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రహదారిపై ఏర్పడిన గుంతను పాతాళానికి దారిగా అభివర్ణించారు. ఇలాంటి ప్రమాదాలు ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తాయని, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నితిన్ కోహ్లీ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎఫ్డీఏ సోదాలు.. రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంటనూనె సీజ్
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ