రూ.20 లంచం కేసు.. 30 ఏళ్ల పోరాటం
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:51 AM
20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణతో ఓ మాజీ కానిస్టేబుల్ 30 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. చివరకు కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కానీ, తీర్పు...
నిర్దోషిగా తేలిన మరుసటి రోజే మరణం
గుజరాత్లో మాజీ కానిస్టేబుల్ విషాదగాథ
అహ్మదాబాద్, ఫిబ్రవరి 7: 20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణతో ఓ మాజీ కానిస్టేబుల్ 30 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. చివరకు కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కానీ, తీర్పు వెలువడిన మరుసటి రోజే ఆయన మరణించారు. ఈ విషాదకర ఘటన గుజరాత్లో జరిగింది. 1996లో అహ్మదాబాద్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బాబుభాయ్ ప్రజాపతిపై రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో కేసు నమోదైంది. 2004లో సెషన్స్ కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ బాబుభాయ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి సుమారు 22 ఏళ్ల పాటు ఆ అప్పీల్ కోర్టులో పెండింగ్లోనే ఉంది. ఈ నెల 4న న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ఆ సమయంలో ఆయన.. ‘‘నా జీవితంపై ఉన్న మచ్చ తొలగిపోయింది. ఇప్పుడు దేవుడు నన్ను తీసుకెళ్లినా నాకు ఎలాంటి బాధ లేదు. ప్రశాంతంగా కన్నుమూస్తా’’ అన్నారు. ఆయన అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. తీర్పు వచ్చిన మరుసటి రోజే బాబుభాయ్ గుండెపోటుతో మరణించారు.
ఈ వార్తలూ చదవండి:
లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్