ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గడానికి అసలు కారణం ఇదా..
ABN , Publish Date - May 27 , 2026 | 09:41 PM
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు పడిపోయిన వైనాన్ని నిపుణులు గుర్తించారు. స్మార్ట్ ఫోన్ వినియోగంతో యువతలో ఆశలు, అంచనాలు మారిపోయి ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోతుంది. జనాభా స్థిరంగా ఉండేందుకు అవసరమైన దాటికంటే (2.1) దిగువకు పడిపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని మూడింట రెండు వంతుల దేశాల్లో ప్రస్తుతం జననాల రేటు 2.1 కంటే దిగువకు పడిపోయింది. కొన్ని దేశాలు అసలు జననాలే లేని స్థితికి కూడా చేరుకుంటున్నాయి. అయితే, స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం ఈ పరిస్థితికి ఒక ముఖ్య కారణమని పరిశోధకులు తేల్చారు.
సాధారణంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ధనిక దేశాల్లో పునరుత్పత్తి రేటు తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మెక్సికో, బ్రెజిల్, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల్లో జననాల రేటు ధనిక దేశాల కంటే దిగువకు పడిపోయింది. భారత్లో 2024లో టోటల్ ఫర్టిలిటీ రేటు 1.9కు పడిపోయింది. బిహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే జననాల రేటు 2.1 కంటే ఎగువన ఉంది. 2031 నాటికి ఈ రేటు 1.6కు పడిపోవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.
పిల్లల్ని కనే స్థాయిలో స్త్రీపురుషుల మధ్య బలమైన బంధాలు ఏర్పడకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు తేల్చారు. తమకు కాబోయే భాగస్వామిపై యువతీయువకులకుండే అంచనాలు స్మార్ట్ఫోన్ ప్రభావం వల్ల మారిపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. 2007-2015 కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన కొద్దీ జననాల రేటు పడిపోయిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వాస్తవ ప్రపంచంలో జంటలమధ్య ఉండాల్సిన భావోద్వేగ బంధాలు స్మార్ట్ ఫోన్ కారణంగా తగ్గిపోతున్నాయని చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే..? ఇవిగో చిట్కాలు..
లిచీ పండ్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?