రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి
ABN , Publish Date - May 18 , 2026 | 02:33 AM
రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ భారీగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దాడుల్లో ఓ ...
ఓ భారతీయ కార్మికుడు సహా నలుగురి మృతి
కీవ్/మాస్కో, మే 17: రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ భారీగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దాడుల్లో ఓ భారతీయ కార్మికుడితో పాటు ముగ్గురు రష్యన్ పౌరులు మృతి చెందారు. మాస్కోలోని ఓ ఆయిల్ రిఫైనరీ వద్ద జరిగిన పేలుళ్లలో 12 మంది గాయపడ్డారు. నగరంలోని ఓ ప్రధాన విమానాశ్రయ ప్రాంగణంలో డ్రోన్ శకలాలు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉక్రెయిన్ డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మాస్కో వైపు దూసుకొచ్చిన 81 డ్రోన్లను కూల్చివేసినట్లు నగర మేయర్ పేర్కొన్నారు. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధ్రువీకరించారు. మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్పై డ్రోన్ దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది గాయపడగా.. జెలెన్స్కీ సొంత గ్రామంలో పలు నివాస భవనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.