ఇరాన్ సైనిక దళం ఐఆర్జీసీతో దేశభద్రతకు ముప్పు: యూకే
ABN , Publish Date - Jul 13 , 2026 | 07:04 PM
ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన సైనిక దళం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్తో తమ దేశ భద్రతకు ముప్పు ఉందని యూకే ప్రభుత్వం పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన సైనిక దళం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్తో (ఐఆర్జీసీ) తమ దేశ భద్రతకు ముప్పు ఉందని యూకే ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హోం శాఖ సెక్రటరీ షబానా మహమూద్ కీలక ప్రకటన చేశారు. దేశ భద్రతకు ముప్పుగా మారిన సంస్థగా ఐఆర్జీసీని ప్రకటించనున్నట్టు హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా చట్టం ప్రకారం ఐఆర్జీసీని నిషేధించనున్నట్టు పేర్కొంది.
ఐఆర్జీసీతో పాటు ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ కంపానియన్ ఆఫ్ రైట్స్ సంస్థతో (ఐసీఎమ్ఆర్) దేశభద్రతకు ముప్పు ఉందని ప్రభుత్వం పేర్కొంది. యూదులు టార్గెట్గా జరిగిన పలు దాడుల్లో ఐఎమ్సీఆర్ ప్రమేయం ఉన్నట్టు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రష్యా మిలిటరీకి చెందిన నిఘా విభాగం జీఆర్యూను కూడా దేశానికి ముప్పుగా యూకే పేర్కొంది. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఈ మూడు సంస్థలతో బ్రిటన్ దేశానికి ముప్పు ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూకే జాతీయ ప్రయోజనాలు దెబ్బతినేలా సైబర్దాడులు జరగడం, బ్రిటన్లోని ఇద్దరు ఇరాన్ జర్నలిస్టులను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టు వెలుగులోకి రావడంతో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అన్ని ఆధారాలూ పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని హోం శాఖ తెలిపింది. ఈ మూడు సంస్థలు బ్రిటన్లో అక్రమచర్యలకు దిగాయన్న ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. యూకే భద్రత, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ మెషిన్గన్ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..
ఇరాన్ హిట్లిస్ట్లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..