అమెరికా ఎయిర్ బేస్పై ఇరాన్ దాడులు.. సైనిక విమానాలు ధ్వంసం..
ABN , Publish Date - Sep 10 , 2026 | 09:35 AM
జోర్డాన్లోని అమెరికా ఎయిర్ బేస్పై ఇరాన్ మిసైల్ దాడులు చేసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో ఒక ఏ 10 థండర్బోల్ట్ విమానంతో పాటు ఎనిమిది ఎఫ్ 15 ఫైటర్ జెట్లు దెబ్బతిన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: జోర్డాన్లోని అమెరికా ఎయిర్ బేస్పై ఇరాన్ మిసైల్ దాడులు చేసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో ఒక ఏ 10 థండర్బోల్ట్ విమానంతో పాటు ఎనిమిది ఎఫ్ 15 ఫైటర్ జెట్లు దెబ్బతిన్నాయి. ఏ 10 థండర్బోల్ట్ విమానం ఎడమ రెక్క ఇరాన్ దాడుల్లో పూర్తిగా విరిగి పోయింది. ఎనిమిది ఎఫ్ 15 ఫైటర్ జెట్లు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ సీబీఎస్ రిపోర్టర్ జెన్నీఫర్ జాకబ్స్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో.. ‘జోర్డాన్లోని అమెరికా దళాలు ఇరాన్ దాడులను ఎదుర్కోవడానికి 30కిపైగా పేట్రియాట్ మిసైల్స్ను ప్రయోగించాయి. అంతకుక్రితం.. అమెరికా యుద్ధ నౌకలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఆ దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఐదు ఆయిల్ ట్యాంకర్లను అమెరికా ధ్వంసం చేసింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రతీకార దాడులు చేసింది. తాము అమెరికాకు చెందిన ఎనిమిది ఆయిల్ ట్యాంకర్లు, రెండు యుద్ధనౌకలపై దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. జోర్డాన్లోని ముఫావక్ సాల్టీ ఎయిర్ బేస్పై దాడులు చేసినట్లు తెలిపింది’ అని పేర్కొన్నారు.
ఆ ఎన్నికల తర్వాత ఇరాన్తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
నవంబర్లో జరగబోయే మిడ్టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్ యుద్ధం ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘ఎన్నికలు ముగిసిన వెంటనే యుద్ధం ఆగే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే.. ఇరాన్ ఎక్కువ రోజులు యుద్ధంలో కొనసాగే అవకాశం లేదు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి టెహ్రాన్ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది’ అని అన్నారు.