భారీ భూకంపం.. ఫిలిప్పీన్స్లో సునామీ హెచ్చరికలు జారీ
ABN , Publish Date - Jun 08 , 2026 | 09:30 AM
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరానికి సమీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో, ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ ఫిలిప్పీన్స్ తీరానికి సమీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో, ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని వారిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైనా ప్రాంతాలకు వెళ్లాలని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ కూడా సూచించారు. మిండనావో ద్వీపం దక్షిణ తీరానికి కొద్ది దూరంలో భూకంప కేంద్రం ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ పేర్కొంది. భూకంప తీవ్రత దృష్ట్యా ఇండోనేషియా, మలేషియా దేశాలు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.
మరోవైపు, దక్షిణ ఫిలిప్పీన్స్లోని కొన్ని తీర ప్రాంతాల్లో మీటరు ఎత్తున్న అలలు చొచ్చుకు రావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సారంగాయ్ ప్రావిన్స్లో విద్యుత్ సరఫరాతో పాటు టెలిఫోన్ సేవలు కూడా నిలిచిపోయాయి. మిండనావో ద్వీపం దక్షిణ తీరంలోని జనరల్ శాంటోస్ నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం భూప్రకంపనల తీవ్రతకు భారీగా దెబ్బతింది. మరికొన్ని చోట్ల ఇళ్లల్లోని ఫర్నీచర్, ఇతర వస్తువులు దెబ్బతిన్నాయి. ఇక మూడు మీటర్ల ఎత్తున అలలు మరికొన్ని గంటల్లో ఫిలిప్పీన్స్ను తాకే అవకాశం ఉందని పెసిఫిక్ సునామీ వార్నింగ్ కేంద్రం అలర్టులు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్ మాటల్ని పట్టించుకోని ఇజ్రాయెల్!.. ఇరాన్పై ప్రతీకార దాడులు
గల్ఫ్లో ఉద్రిక్తత.. ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైల్ దాడి