రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదరకుండా అడ్డుకున్న వారిలో ప్రధాని మోదీ ఒకరు: పోలాండ్ మంత్రి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:28 PM
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదరకుండా భారత్ కీలక పాత్ర పోషించిందని పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిస్లా టోఫిల్ బార్టోజోవ్స్కీ ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదరకుండా భారత్ కీలక పాత్ర పోషించిందని పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిస్లా టోఫిల్ బార్టోజోవ్స్కీ ప్రశంసించారు. అతికొద్ది మంది ప్రపంచనేతల అభిప్రాయాలనే రష్యా అధ్యక్షుడు పుతిన్ పరిగణనలోకి తీసుకుంటారని ఆయన చెప్పారు. వారిలో ప్రధాని మోదీ కూడా ఒకరని అన్నారు. ఉక్రెయిన్పై అణుదాడి చేయకుండా రష్యాను నిరోధించడంలో ప్రధాని మోదీ కూడా కీలక పాత్ర పోషించారని చెప్పారు.
చైనా కూడా ఈ విషయంలో ముఖ్యపాత్ర పోషించిందని చెప్పారు. సోవియట్ యూనియన్తో, ఆ తరువాత రష్యాతో భారత్కు దశాబ్దాల తరబడి దౌత్య సంబంధాలు ఉన్నాయని అన్నారు. దీంతో, శాంతిస్థాపనకు భారత్కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రధాని మోదీని అనేక దేశాలు గౌరవిస్తాయని చెప్పారు. రష్యా అధ్యక్షుడిని ప్రభావితం చేయగలిగిన అతికొద్ది మంది నేతల్లో ప్రధాని మోదీ కూడా ఒకరని అన్నారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్తో నెలకొన్న భేదాభిప్రాయాలు తొలగిపోయాయని కూడా పోలాండ్ మంత్రి చెప్పారు. చమురు దిగుమతుల విషయంలో భారత్కు ఉన్న ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకున్నామని అన్నారు.
ఇదిలా ఉంటే, ఇటీవల రష్యా అధ్యక్షుడు కూడా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. రష్యాతో దౌత్య సంబంధాల విషయంలో భారత్పై ఒత్తిడి చేయడం వృథా అని ప్రపంచదేశాలకు అర్థమైందని అన్నారు. అత్యధిక జనాభా కలిగిన దేశంపై ఒత్తిడి తేవడం అంతర్జాతీయంగా ద్వైపాక్షింగా ఇబ్బంది కరమని ప్రపంచదేశాలు అర్థం చేసుకున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
హోర్ముజ్ టోల్ ఫీజుపై వెనక్కు తగ్గిన ట్రంప్
హసీనా బంగ్లాదేశ్ వస్తే అరెస్ట్ చేస్తాం: బంగ్లాదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!