పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత!
ABN , Publish Date - Sep 04 , 2026 | 06:29 AM
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మళ్లీ ముసురుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు నెమ్మదించడంతో సుమారు నెలరోజులుగా కాస్త ప్రశాంతంగా కనిపించినా.. తాజాగా పరస్పర దాడులు మొదలవడం ఆందోళన రేపుతోంది.
ఇరాన్పై అమెరికా దాడుల్లో 5 రోజుల్లో 18 మంది మృతి
ప్రతిగా అమెరికా స్థావరాలపైకి ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు
టెహ్రాన్/దుబాయ్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మళ్లీ ముసురుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు నెమ్మదించడంతో సుమారు నెలరోజులుగా కాస్త ప్రశాంతంగా కనిపించినా.. తాజాగా పరస్పర దాడులు మొదలవడం ఆందోళన రేపుతోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ బుధ, గురువారాల్లో తెల్లవారుజామున హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ తీరం వెంట 60 ప్రాంతాల్లో దాడులు చేసింది. పలు క్షిపణి, డ్రోన్ ప్రయోగ వ్యవస్థలు, నిల్వ కేంద్రాలను, సముద్రపు మందుపాతరల (సీమైన్స్)ను పెట్టే బోట్లను, నౌకాదళ కేంద్రాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. దీనికి ప్రతిగా ఇరాన్ గురువారం కువైట్, యూఏఈ, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలపైకి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కువైట్లోని అహ్మద్ అల్ జబేర్ ఎయిర్బేస్లో ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆయుధాల గోదాములు, ఫైటర్ జెట్ల హ్యాంగర్లను ధ్వంసం చేశామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. యూఏఈలోని అల్ మిన్హాద్ ఎయిర్బేస్లో రాడార్ వ్యవస్థలను దెబ్బతీశామని తెలిపింది. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలు మళ్లీ బ్యారెల్కు 100 డాలర్ల సమీపానికి చేరాయి. గురువారం సాయంత్రం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 97.39 డాలర్లకు చేరింది