13 అమెరికా స్థావరాల్లో విధ్వంసం!
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:32 AM
ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు గణనీయంగానే నష్టం జరిగింది. పలుచోట్ల కీలకమైన పరికరాలు...
బలగాలు ఉండలేని దుస్థితిలోకి పశ్చిమాసియాలోని సైనిక బేస్లు
న్యూయార్క్ టైమ్స్ కథనం
న్యూయార్క్, మార్చి 26: ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు గణనీయంగానే నష్టం జరిగింది. పలుచోట్ల కీలకమైన పరికరాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా 13 అమెరికా స్థావరాల్లో విధ్వంసం చోటు చేసుకుందని.. వాటిలో బలగాలు ఉండలేని స్థితి నెలకొందని రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. ప్రధాన స్థావరాలు దెబ్బతినడంతో వేలాది మంది సిబ్బంది చెల్లాచెదురయ్యారని.. కొందరిని యూరప్ దేశాలకు, మరికొందరిని సమీపంలోని హోటళ్లు, ఇతర కార్యాలయాలకు తరలించారని పేర్కొంది. దీనితో ఇది రిమోట్ వార్గా మారిందని, బలగాల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. సైనిక బలగాలు తాత్కాలిక కేంద్రాల నుంచి ఆపరేషన్లు నిర్వహించగలవని.. అయితే పూర్తిస్థాయిలో ఉండటం కష్టమని అమెరికా ఎయిర్ఫోర్స్ విశ్రాంత అధికారి వెస్ బ్రయాంట్ పేర్కొన్నారు. ఎందుకంటే ఒక హోటల్పై మిలిటరీ పరికరాలన్నీ ఏర్పాటు చేయలేమని చెప్పారు.
స్థావరాలకు గణనీయంగానే నష్టం
న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కువైట్లోని పోర్ట్ షూయిబా, అలీ అల్ సలేమ్ ఎయిర్బేస్, క్యాంప్ బ్యూహ్రింగ్ స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పోర్ట్ షూయిబాలోని ఆర్మీ వ్యూహాత్మక ఆపరేషన్స్ కేంద్రం నాశనమైంది. అక్కడ ఆరుగురు అమెరికా సైనికులు మృతిచెందారు. ఖతార్లోని అల్ ఉదేద్ ఎయిర్బే్సలో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు తీవ్ర నష్టం కలిగించాయి. కీలక రాడార్ వ్యవస్థ నాశనమైంది. బహ్రెయిన్లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బే్సలో కేసీ-135 ట్యాంకర్ విమానాలు, కమ్యూనికేషన్స్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..