నేనే దేవుణ్ని..
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:27 AM
నిత్యం వివాదాస్పద ప్రకటనలతో మీడియాలో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏసు ప్రభువు అవతారవెత్తారు.
జీసస్ అవతారమెత్తిన డొనాల్డ్ ట్రంప్
సోషల్మీడియాలో ఫొటో పోస్టు
వాషింగ్టన్, ఏప్రిల్ 13: నిత్యం వివాదాస్పద ప్రకటనలతో మీడియాలో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏసు ప్రభువు అవతారవెత్తారు. తన దివ్య శక్తులతో ఓ రోగికి స్వస్థత చేకూరుస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ఒక ఫొటోను రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు. ఇరాన్ యుద్ధం విషయంలో క్యాథలిక్ క్రైస్తవుల మతపెద్ద పోప్ 14వ లియోతో మాటల యుద్ధం నేపథ్యంలో ట్రంప్ ఆదివారం రాత్రి ఈ ఫొటోను షేర్ చేశారు. అందులో మంచంపై ఉన్న ఓ రోగికి తన దివ్య శక్తులతో ట్రంప్ స్వస్థత చేకూరుస్తున్నట్లు ఉంది. ఆయన వెనుక అమెరికా సైనికుల రూపంలో ఉన్న దేవదూతలు, గద్దలు, యుద్ధ విమానాలు ఎగురుతున్నాయి. అమెరికా జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. రోగి మంచం చుట్టూ ఓ నర్సు, ఒక అమెరికా సైనికుడు, ఒక పౌరుడు, మరో మహిళ కూర్చుని దివ్య తేజస్సుతో ఉన్న ట్రంప్కు భక్తితో నమస్కరిస్తున్నట్లుగా ఉంది. అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో కొన్ని గంటల తర్వాత ఆ ఫొటోను ట్రంప్ తొలగించారు.