Share News

చైనాలో భూప్రకంపనలు.. ఇద్దరి మృతి, వేలాది మంది తరలింపు, కూలిన భవనాలు

ABN , Publish Date - May 18 , 2026 | 03:10 PM

చైనాలోని నైరుతి ప్రాంతమైన గ్వాంగ్షీ ప్రావిన్స్‌లో సంభవించిన భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించగా, లియుజౌ నగరం నుంచి 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చైనాలో భూప్రకంపనలు.. ఇద్దరి మృతి, వేలాది మంది తరలింపు, కూలిన భవనాలు
China Earthquake: 2 Dead, Thousands Evacuated

బీజింగ్, మే 18: చైనాలోని నైరుతి ప్రాంతమైన గ్వాంగ్షీ (Guangxi) ప్రావిన్స్‌లో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున సంభవించిన శక్తిమంతమైన భూప్రకంపనలు తీవ్ర కలకలం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించగా, లియుజౌ (Liuzhou) నగరం నుంచి సుమారు 7,000 మందికి పైగా నివాసితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.


చైనా అధికారిక వార్తా సంస్థ 'గ్జిన్హువా', స్టేట్ బ్రాడ్‌కాస్టర్ 'CCTV' అందించిన వివరాల ప్రకారం భూప్రకంపనల కారణంగా ఒక జంట (63 ఏళ్ల పురుషుడు, 53 ఏళ్ల స్త్రీ) మరణించినట్లు నిర్ధారించారు. మరొకరు గల్లంతవగా ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు, అయితే వారికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.


సోమవారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి 13 భవనాలు పూర్తిగా కుప్పకూలాయి. ఎత్తైన భవనాల నుంచి ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. కూలిపోయిన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని సహాయక సిబ్బంది స్నిఫర్ డాగ్స్ సహాయంతో శోధిస్తున్నారు.


భూప్రకంపనల కారణంగా రైల్వే లైన్ల మౌలిక సదుపాయాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలో రైల్వే అధికారులు తనిఖీలు చేపట్టారు. దీనివల్ల పలు ప్రాంతాల్లో రైలు రవాణాకు అంతరాయం ఏర్పడవచ్చని హెచ్చరించారు. భూప్రకంపనలు సంభవించినప్పటికీ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ లైన్లు, తాగునీరు, గ్యాస్ సరఫరాతో పాటు రోడ్డు రవాణా యథావిధిగా, సాధారణంగానే కొనసాగుతున్నట్లు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.


విపత్తు నిర్వహణ సంస్థలు ఘటనా స్థలానికి చేరుకుని, భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 18 , 2026 | 04:10 PM