ఇంటర్, పదో తరగతి పరీక్షలకు ..అదనంగా 5 నిమిషాల అనుమతి
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:15 AM
రాష్ట్రంలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల ప్రారంభ వేళల కంటే విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా..
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: సీఎస్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల ప్రారంభ వేళల కంటే విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం నుంచి(25న) ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్తు, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలతో పాటు ిసీసీ టీవీలను ఏర్పాటు చేయాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాయకూడదని, అన్ని కేంద్రాలలో బెంచీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ.. ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,89,055 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,53,832 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వివరించారు. 5,28,239 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు.