ప్రవేశ పరీక్షలో ద్విభాషా ప్రశ్నపత్రం
ABN , Publish Date - Jul 18 , 2026 | 02:22 AM
మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. ఇవి...
మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. ఇవి ఎంతోమంది నిపుణులను దేశానికి అందించాయి. ఇటీవల నవోదయ ప్రవేశ పరీక్షలో పర్యావరణ అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వడం విద్యార్థుల సమగ్ర అవగాహనను పరీక్షించే మంచి మార్పు. అయితే ప్రస్తుతం అభ్యర్థి ఎంచుకున్న ఒక్క భాషలోనే ప్రశ్నపత్రం ఇవ్వడం గ్రామీణ విద్యార్థులకు కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్ల మాధ్యమం విస్తరించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో చాలామందికి ఆంగ్ల భాషపై పూర్తి పట్టు ఇంకా ఏర్పడలేదు. అదే సమయంలో మాతృభాషలో చదివే అలవాటు కూడా తగ్గుతోంది. ఫలితంగా ప్రవేశ పరీక్ష సమయంలో ప్రశ్న భావాన్ని అర్థం చేసుకోవడంలో కొందరు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇది వారి ప్రతిభకు సంబంధించిన సమస్య కాదు, భాషకు సంబంధించిన సమస్య మాత్రమే. ఇకనైనా నవోదయ ప్రవేశ పరీక్షలో ప్రతి ప్రశ్నను స్థానిక భాషతో పాటు ఆంగ్లంలో కూడా ముద్రించాలి. దీనివల్ల విద్యార్థులు ప్రశ్నను స్పష్టంగా అర్థం చేసుకుని తమ నిజమైన ప్రతిభను ప్రదర్శించగలరు. ఈ అంశంపై ప్రభుత్వం, విద్యావేత్తలు, నవోదయ విద్యాలయ సమితి సానుకూలంగా స్పందించి, ద్విభాషా ప్రశ్నపత్ర విధానాన్ని అమలు చేయాలి.
యనమందల ఆనందం, ఏలూరు
ఈ వార్తలనూ చదవండి:
130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్!
భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు