భారత్ వాణిజ్య విజయాలు– త్రీ బిగ్ డీల్స్
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:34 AM
భారతదేశ వాణిజ్యాన్ని పెంచడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదం చేసే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ మధ్య చేసుకున్న...
భారతదేశ వాణిజ్యాన్ని పెంచడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదం చేసే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ మధ్య చేసుకున్న మూడు వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ దేశాలను ఒక్కసారిగా భారత్ వైపు చూసేలా చేశాయి. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలు కీర్తిస్తుంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’గా అభివర్ణిస్తూ నోరుపారేసుకోవడం అందరికీ తెలిసిందే. భారత్ మాత్రం పరిణతి ప్రదర్శిస్తూ, మౌనంగానే వేచి చూస్తూ, ఇతర దేశాలతో వ్యూహాత్మకంగా ఒప్పందాలు చేసుకుంటూ, ట్రంప్ దిగిరాక తప్పని పరిస్థితులు కల్పించింది. ఇప్పుడు స్వయంగా భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోక తప్పని పరిస్థితి అమెరికాకు కలిగింది.
ఇక భారత్ చేసుకున్న త్రీ గ్రేట్ డీల్స్ విషయానికొద్దాం. ముందుగా యూకేతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ). గత ఏడాది అక్టోబర్లో భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత ప్రతినిధి బృందాల స్థాయిలో చర్చలు జరిగాయి. రక్షణ రంగ సహకారం, బ్రిటన్ విద్యాసంస్థల ప్రాంగణాలు మన దేశంలో ఏర్పాటు చేసుకోవడం తదితర ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో పాటు తేలికపాటి బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థల్ని భారత సైన్యానికి సరఫరా చేసి, గగనతల రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, సంయుక్త ఆర్థిక, వాణిజ్య కమిటీ (జెట్కో)ని మళ్ళీ ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన భద్రతకు ప్రాంతీయ వ్యవస్థ ఏర్పాటు, ఖనిజాల రంగంలో సహకారానికి ఇండస్ట్రీ గిల్డ్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. భారత్తో సుమారు రూ.15,360 కోట్ల (1.3 బిలియన్ పౌండ్స్) విలువైన వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. నిజానికి ఆర్థిక వ్యవస్థల వరుసలో నాలుగో స్థానంలో ఉన్న భారత్తో యూకే చేస్తున్న వ్యాపారం స్వల్పమే అయినా, ఇరుదేశాల మధ్యా ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ ఒప్పందం అనేక అవకాశాలను మెరుగుపరుస్తుంది.
రెండోది– భారత్, ఐరోపా కూటమి (ఈయూ) మధ్య జరిగిన చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ). మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలుస్తున్న ఈ ఒప్పందాన్ని జనవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ నేతలు ఉర్సులా వాన్డెర్ లెయెన్, ఆంటోనియా కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. ఈ ఒప్పందం వలన 27 దేశాల సమాఖ్య అయిన ఈయూలోకి 99శాతం భారత ఎగుమతులకు ప్రాధాన్య ప్రవేశం లభించనుంది. మనదేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీలకు సరికొత్త అవకాశాలు కలగనున్నాయి. కార్మిక ఆధారిత రంగాలకు భారీ ప్రయోజనాలు దక్కనున్నాయి. ప్రపంచ జీడీపీలో భారత్, ఈయూ ఉమ్మడి వాటా 25శాతం. ఈ ఒప్పందం దాదాపు 200కోట్ల మందికి ఉమ్మడి మార్కెట్ను సృష్టిస్తుంది. భారత్ నుంచి ఎగుమతి చేసే టెక్స్టైల్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, హస్తకళలు, పాదరక్షలు, రత్నాభరణాలు, సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. 33 బిలియన్ డాలర్ల (సుమారు 3 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులకు ప్రస్తుతం 4 నుంచి 26శాతం సుంకం ఉండగా... ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన వెంటనే 0శాతం సుంకం వర్తిస్తుంది. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలపై సుంకాలు తగ్గుతాయి. ఇక ఈయూ నుంచి మన విద్యార్థుల రాకపోకలపై పరిమితి ఉండదు. వృత్తి నిపుణులకు వర్క్ వీసా హామీ లభిస్తుంది. మేధో సంపత్తి సంస్థ (GTRI) అంచనా ప్రకారం భారత్కు విమానాలు, విమానాల విడిభాగాలు, ఎలక్ట్రికల్ మెషినరీ, వజ్రాలు, రసాయనాలను అధికంగా ఎగుమతి చేయడం ద్వారా ఈయూ ప్రయోజనం దక్కించుకోగలదు. రెండు లక్షల కోట్ల డాలర్ల విలువైన ఈయూ పారిశ్రామిక విపణిలోకి సుంకాల్లేకుండా ప్రవేశించగలగడం– దేశీయ యంత్ర సామగ్రి ఎగుమతుల విలువను 2030 నాటికి 30వేల కోట్లకు చేర్చాలన్న భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఈ ఒప్పందం దోహదపడుతుంది. భారతీయ సంప్రదాయ వైద్యరీతుల్ని అనుసరిస్తున్న వైద్యులు ఇకపై ఈయూ సభ్య దేశాల్లో తమ సేవల్ని అందించవచ్చు. భారత్–ఈయూ పక్షాల మధ్య ఆయుధ ఉత్పత్తి, రక్షణ రంగంలో వ్యూహాత్మక బంధం రాబోయే రోజుల్లో పెరగనుంది. ఫార్మా, ఐటీ, జౌళి, ఇంజినీరింగ్ రంగాల్లో భారత్ మరింత లాభపడుతుంది.
మూడోది– భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం. గత మూడు దశాబ్దాల్లో భారత్, అమెరికా మధ్య స్నేహబంధం బలోపేతం అయినా, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన తరువాత ప్రకటించిన సుంకాల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నిర్ణయంతో మోదీ వ్యాపార దక్షత ప్రదర్శించి ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టారు. నిపుణులు ఇది గమనించి, ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఇరు దేశాల స్నేహ సంబంధాలు పైనే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడంతో ట్రంప్ దిగివచ్చి భారత్పై టారిఫ్లను 18శాతానికి తగ్గిస్తున్నామని ప్రకటించారు. ఈ ఒడంబడికపై ఫ్రేమ్ వర్క్ కూడా ఖరారు చేశారు. ఈ ఒప్పందంలో వ్యవసాయ, పాడి రంగాలకు పూర్తి రక్షణ లభించనుందని, జౌళి–వస్త్రాలు, ప్లాస్టిక్, గృహాలంకరణ సామగ్రి, తోలు ఉత్పత్తులు, రత్నాభరణాలు, సేంద్రీయ రసాయనాలు, రబ్బరు ఉత్పత్తులు, యంత్రాలు, విమాన తయారీ రంగంలోని కార్మికులకు అపార అవకాశాలు లభిస్తాయని, భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల వ్యాపారానికి ద్వారాలు తెరుచుకుంటాయని కేంద్ర వాణిజ్య శాఖామంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్లోని తయారీదారులు, ఎగుమతిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బలపడతారు. దేశంలోని తయారీ రంగానికి మాత్రం అమెరికా ఒప్పందంతో నేరుగా ప్రయోజనాలు దక్కనున్నాయి. భారత ఆక్వా ఉత్పత్తులకు చైనా, ఐరోపా దేశాల తర్వాత అమెరికాయే పెద్ద మార్కెట్ కావడంతో ఈ ఒప్పందం ఏపీ వంటి రాష్ట్రాలకు నిజంగా శుభవార్తే.
కూసంపూడి శ్రీనివాస్
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్సిగ్నల్
స్పీకర్ ఛాంబర్లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు