మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:50 PM
మరికొన్ని గంటల్లో వారి పెళ్లి ఉందనంగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్లో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: వారిద్దరూ అక్కాచెల్లెళ్లు.. ఒకే రోజున వారి వివాహాలకు ముహూర్తం ఖరారైంది. దీంతో ఆ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కానీ మరుసటి రోజు వారి పెళ్లి ఉందనంగా ఆ అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్కాచెల్లెళ్లైన శోభ (25), విమల (23) వివాహాలు శనివారం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లన్నీ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయి. శుక్రవారం రాత్రి వారిద్దరూ నిద్రకు ఉపక్రమించారు. శనివారం ఉదయం తెల్లవారుజామున వారి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించినట్టు గుర్తించిన కుటుంబసభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో, కుటుంబసభ్యులు యువతుల మృతదేహాలను ఇంటికి తరలించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు.
ఈలోపు పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషం తాగి యువతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ వార్తలూ చదవండి:
చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన పోలీసులు.. వీడియో వైరల్
ట్రంప్ విధానాలపై తండ్రీకూతుళ్ల వాగ్వాదం.. యువతి దుర్మరణం