ఛత్తీస్గఢ్లో దారుణం.. పిల్లల ముందే భార్యకు చిత్ర హింసలు
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:45 PM
ఛత్తీస్గఢ్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను తమ పిల్లల ముందే దారుణంగా హింసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్గఢ్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను తమ పిల్లల ముందే దారుణంగా హింసించాడు. ఘోరంగా అవమానించి, సజీవ దహనం చేస్తానని బెదిరించాడు. కొరియా జిల్లాలో ఇటీవల ఈ దారుణం వెలుగు చూసింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, తార, జితేంద్ర ఘాసియా అనే దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు. అయితే, చాలా కాలం పాటు భర్త చేతిలో రకరకాల బాధలు అనుభవించానని మహిళ ఫిర్యాదు చేసింది. చివరకు పిల్లల్ని తీసుకుని వేరుగా తన బతుకేదో తాను బతుకుతుంటే ఇటీవల అతడు తన ఇంటికి వచ్చి దారుణంగా హింసించాడని పేర్కొంది. తన చేతులు, కాళ్లూ కట్టేసి, ముఖానికి బూడిద పూసి, జుట్టు కత్తిరించాడని పేర్కొంది.

అతడు ఒత్తిడి చేయడంతో తన పిల్లలే తనపై పలుమార్లు చేయిచేసుకున్నారని పేర్కొంది. వారి కళ్లముందే తనతో మూత్రం తాగించాడని ఆరోపించింది. అతడితో కలిసున్న సమయంలో కూడా తనపై ఇష్టారీతిన చేయి చేసుకునేవాడని పేర్కొంది. కట్నం వేధింపులు కూడా ఉండేవని తెలిపింది. ఇతరులతో వివాహేతర సంబంధాలు అంటగట్టి వేధించేవాడని ఆరోపించింది.
మహిళ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భార్యను హింసించడం, నేరపూరిత బెదిరింపులకు దిగడం తదితర సెక్షన్ల కింద జితేంద్రపై కేసు నమోదు చేశారు. అయితే, జితేంద్ర తన భార్యపై దాడి చేసిన వీడియో కూడా పోలీసుల దృష్టికి రావడంతో నిందితుడిపై ఇతర అభియోగాలతో కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేశామని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: