వైజాగ్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు
ABN , Publish Date - May 04 , 2026 | 02:18 AM
జపాన్కు చెందిన టైర్ల తయారీ సంస్థ యోకోహమా ఇండియా.. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలోని ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 శాతం నుంచి 70 శాతం మేర పెంచినట్లు...
యోకోహమా ఇండియా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జపాన్కు చెందిన టైర్ల తయారీ సంస్థ యోకోహమా ఇండియా.. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలోని ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 శాతం నుంచి 70 శాతం మేర పెంచినట్లు ప్రకటించింది. గతంలో రోజుకు 2,000 టైర్లను తయారు చేసిన ఈ ప్లాంట్లో ప్రస్తుతం 5,000 టైర్లకు ఉత్పత్తిని పెంచినట్లు సంస్థ మార్కెటింగ్ హెడ్ గౌరవ్ మహాజన్ వెల్లడించారు. 2023లో రూ.750 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 17 లక్షల టైర్లుగా ఉందని ఆయన తెలిపారు. దేశీయంగా టైర్లకు పెరుగుతుండటంతో అందుకనుగుణంగా వైజాగ్ ప్లాంట్లో ఉత్పత్తిని పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్లో చిన్న కార్ల టైర్ల నుంచి ఎస్యూవీ టైర్ల వరకు ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ధరలు పెరిగే చాన్స్: పశ్చిమాసియా యుద్ధం కారణంగా కార్బన్ బ్లాక్, కెమికల్స్, నైలాన్, పాలిస్టర్తో పాటు డెరివేటివ్ ఉత్పత్తుల ధరలు పెరగటంతో టైర్ల ధరలను ఇప్పటికే 3 శాతం మేర పెంచినట్లు మహాజన్ వెల్లడించారు. పశ్చిమాసియా పరిస్థితి రోజురోజుకు మరింత సంక్షిష్టం అవుతుండటంతో ముడి పదార్ధాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో మరోసారి ధరలు పెంచకతప్పని పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీ సార్క్ దేశాలు సహా ఆఫ్రికా మార్కెట్లకు ఎగుమతి చేస్తోందన్నారు. కాగా యోకోహమా ఇండియా దేశవ్యాప్తంగా 3,300 డీలర్ నెట్వర్క్ను కలిగి ఉందన్నారు. ఏపీ, తెలంగాణల్లో 300 వరకు డీలర్షిప్ నెట్వర్క్ ఉందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి