టోకనైజ్డ్ బాండ్లు వచ్చేశాయ్..
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:20 AM
ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీ లిమిటెడ్.. టోకనైజ్డ్ బాండ్ల జారీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో ఇదే తొలి టోకనైజ్డ్ బాండ్ల జారీ అని....
దేశంలో తొలిసారిగా జారీ చేసిన ఆర్ఈసీ
నేటి నుంచి ఎల్ అండ్ టీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీ లిమిటెడ్.. టోకనైజ్డ్ బాండ్ల జారీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో ఇదే తొలి టోకనైజ్డ్ బాండ్ల జారీ అని.. హెచ్డీఎ్ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజాలు సహా పలు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, కార్పొరేట్లు ఆ బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిపాయి. 2028 మే నెలతో గడువు ముగియనున్న ఈ బాండ్లపై ఆర్ఈసీ 7.30 శాతం వార్షిక వడ్డీ ఆఫర్ చేసినట్లు తెలిసింది.
ఎల్ అండ్ టీ కూడా: ప్రైవేట్ రంగ ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ సైతం మూడేళ్ల కాలపరిమితితో కూడిన టోకనైజ్డ్ బాండ్ల జారీ ద్వారా రూ.500 కోట్ల వరకు సమీకరించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బుధవారం జారీ చేయనున్న ఈ బాండ్లపై ఎల్ అండ్ టీ కంపెనీ 7.40 శాతం వార్షిక వడ్డీ ఆఫర్ చేయబోతున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి.
టోకనైజ్డ్ బాండ్లు అంటే..?
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ఈ టోకనైజ్డ్ బాండ్లను జారీ చేస్తారు. బాండ్ల జారీ, వాటి హక్కుదారుతో పాటు బాండ్ల ట్రేడింగ్, సెటిల్మెంట్ వంటి వివరాలను బ్లాక్ చెయిన్ లెడ్జర్లో డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన డిజిటల్ రూపీ (సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ-సీబీడీసీ) ద్వారానే ఈ బాండ్లను కొనుగోలు చేసే వీలుంటుంది. అలాగే, ఈ బాండ్ల సెటిల్మెంట్ కూడా అదే రోజున పూర్తవుతుంది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ మరింత విస్తృతమవడంతో పాటు ద్రవ్య లభ్యత, పారదర్శకత పెంపునకు ఈ టోకనైజ్డ్ బాండ్లు దోహదపడగలవని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
గిల్పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్