Share News

టాటా సన్స్‌ లిస్టింగ్‌పై సస్పెన్స్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:11 AM

టాటా గ్రూపు హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ షేర్ల లిస్టింగ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ కంపెనీ షేర్లను స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో నమోదు చేయాలని ఒత్తిడి చేయవద్దంటూ టాటా సన్స్‌లో..

టాటా సన్స్‌ లిస్టింగ్‌పై సస్పెన్స్‌

వ్యతిరేకిస్తున్న నోయెల్‌ టాటా.. ఆర్‌బీఐకి లేఖ

లిస్టయితే కంపెనీ దాతృత్వ లక్ష్యాలకు

విఘాతం అంటున్న టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌

న్యూఢిల్లీ: టాటా గ్రూపు హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ షేర్ల లిస్టింగ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ కంపెనీ షేర్లను స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో నమోదు చేయాలని ఒత్తిడి చేయవద్దంటూ టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారైన టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్‌ టాటా ఆర్‌బీఐకి లేఖ రాసినట్టు సమాచారం. లిస్టు చేయాలని ఒత్తిడి చేస్తే తమ దీర్ఘకాలిక లక్ష్యాలైన ధార్మిక, దాతృత్వ లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో టాటా సన్స్‌ లిస్టింగ్‌పై టాటా ట్రస్ట్‌లో కొనసాగుతున్న విభేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. టాటా సన్స్‌ వాస్తవ విలువ కనుగొనడం, నిర్వహణలో పారదర్శకత, షాపూర్జీ పల్లోంజి వంటి మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం లిస్టింగ్‌ చేయడం మంచిదని వేణు శ్రీనివాసన్‌, విజయ్‌ సింగ్‌ వంటి టాటా ట్రస్ట్స్‌ సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు లిస్టింగ్‌ కోసం తమను ఒత్తిడి చేయవద్దని టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ హోదాలో నోయెల్‌ టాటా కోరడం విశేషం.

ఇతర కష్టాలు: టాటా సన్స్‌ షేర్లను లిస్టు చేయడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులనూ నోయెల్‌ టాటా తన లేఖలో ఆర్‌బీఐకి వివరించినట్టు తెలుస్తోంది. షేర్లను లిస్టు చేయడం వలన పబ్లిక్‌ షేర్‌హోల్డర్లు ఎంత సేపటికీ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం చూస్తారే తప్ప, దీర్ఘకాలిక ప్రయోజనాలు చూడరని టాటా వివరించారు. అలాంటప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా వంటి నష్టాల్లో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయడమూ కష్టమవుతుందని ఆర్‌బీఐకి వివరించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే లిస్టింగ్‌ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి కంపెనీ ఆర్థిక ఫలితాలు పబ్లిక్‌ షేర్‌ హోల్డర్లకు వివరించడమూ పెద్ద తలనొప్పి అని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.

చంద్రకు మూడో టర్మ్‌ డౌటేనా!

మరోవైపు ఎన్‌ చంద్రశేఖరన్‌ను వరుసగా మూడోసారి టాటా సన్స్‌ చైర్మన్‌గా పునర్నియామకంపైనా సస్పెన్స్‌ కొనసాగుతోంది. గత నెల 26న జరిగిన టాటా సన్స్‌ బోర్డు భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే కొన్ని ఇతర ముఖ్యమైన విషయాలు చర్చించాల్సి ఉన్నందున ఈ విషయాన్ని పక్కన పెడదామని టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్‌ టాటా చెప్పడంతో, చంద్రశేఖరన్‌ పునర్నియామకం చర్చకే రాలేదు. దీంతో చంద్రశేఖరన్‌ టాటా గ్రూపులో కొనసాగుతారా? లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 05:11 AM