నేను ఒప్పుకోను..!
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:58 AM
తన వ్యక్తిగత దివాలా పరిష్కార కేసులో జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ ఏర్పాటును జీ న్యూస్ చానెళ్ల వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్...
ఐదుగురు సభ్యుల బెంచ్ ఏర్పాటును వ్యతిరేకించిన సుభాష్ చంద్ర
ట్రైబ్యునల్కు ఆ అధికారం లేదన్న ఎస్సెల్ గ్రూప్ చైర్మన్
న్యూఢిల్లీ: తన వ్యక్తిగత దివాలా పరిష్కార కేసులో జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ ఏర్పాటును జీ న్యూస్ చానెళ్ల వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర వ్యతిరేకించారు. ట్రైబ్యునల్కు ఆ అధికారం లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎన్సీఎల్టీ ఉత్తర్వు ‘‘లోపభూయిష్టమైంది. తప్పు’’ అని జాతీయ కంపెనీల చట్టం అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందు చంద్ర తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సస్మిత్ పాత్ర పేర్కొన్నారు. చంద్ర కేసును విచారించిన గత బెంచ్లోని ఇద్దరు సభ్యులు భిన్న తీర్పు వెల్లడించడంతో.. ట్రైబ్యునల్ ప్రెసిడెంట్ నీలేశ్ శర్మను మూడో సభ్యుడి(జ్యుడీషియల్)గా నియమించారని, శర్మ ఉత్తర్వులపై కొత్తగా ఏర్పాటైన ఐదుగురు సభ్యుల బెంచ్ స్టే విధించిందని ఎన్సీఎల్ఏటీకి పాత్ర నివేదించారు. కొత్త బెంచ్ సభ్యులు ఎప్పుడు ఒక చోట కూర్చుకుని కేసును విచారించారు..? స్టే విధించడానికి వారికి ఏ అధికారం ఉంది..? అని పాత్ర వాదించారు.
నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో పలువురు రుణదాతల నుంచి రూ.22,006.57 కోట్ల బకాయిల రికవరీ కోసం క్లెయిమ్లు రాగా.. ఈ రుణాలకు వ్యక్తిగత హామీదారుగా ఉన్న సుభాష్ చంద్ర కేవలం రూ.6.5 కోట్ల తిరిగి చెల్లింపులను ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్కు అనుమతిపై స్టే విధించిన కొత్త బెంచ్.. చంద్ర తన ఆస్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విక్రయిచడం లేదా బదిలీ చేయడం లేదా బహుమతిగానూ ఇవ్వడానికి వీల్లేకుండా నిషేధం విధించింది. అలాగే, ఈ కేసులో అన్ని పక్షాలకూ నోటీసులు కూడా జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 23కు వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..