Share News

మార్కెట్లకు ఎస్‌టీటీ దెబ్బ

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:47 AM

డెరివేటివ్స్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) పెంపుపై ఈక్విటీ మార్కెట్‌ తీవ్రంగా స్పందించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన బడ్జెట్లో ఈ పన్నును...

మార్కెట్లకు ఎస్‌టీటీ దెబ్బ

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,370 పాయింట్లు డౌన్‌

చివరకు 1,546 పాయింట్ల పతనంతో 80,722 వద్ద క్లోజింగ్‌

రూ.9.4 లక్షల కోట్ల మదుపరుల సంపద హాంఫట్‌

ముంబై: డెరివేటివ్స్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) పెంపుపై ఈక్విటీ మార్కెట్‌ తీవ్రంగా స్పందించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన బడ్జెట్లో ఈ పన్నును 0.02% నుంచి 0.05 శాతానికి పెంచుతున్నట్టు ప్రతిపాదించారు. బడ్జెట్‌ ప్రతిపాదన నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ నిర్వహించాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రారంభించినప్పుడు లాభాల్లో ఉన్న మార్కెట్‌ ఈ ప్రతిపాదన రాగానే ఉన్నట్టుండి భారీ పతనం చవి చూసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 2,370.36 పాయింట్లు నష్టపోయి మానసిక అవధి 80,000 కన్నా కూడా దిగజారింది. తదుపరి నష్టాలు కొంత పూడ్చుకున్నా కల్లోలం తప్పలేదు. సెన్సెక్స్‌ 1,546.84 పాయింట్ల నష్టంతో 80,722.94 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 748.9 పాయింట్లు కోల్పోయినా ఆ నష్టాన్ని 495.20 పాయింట్లకు కుదించుకుని 24,825.45 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ షేర్లలో ఎస్‌బీఐ 5.61ు నష్టపోగా అదానీ పోర్ట్స్‌ 5.53ు నష్టపోయింది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, టైటన్‌ లాభపడ్డారు బడ్జెట్‌ షాక్‌తో రూ.9.40 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్‌ఈలో లిస్టింగ్‌ అయిన కంపెనీల మార్కెట్‌ విలువ నికరంగా రూ.9,40,581.75 కోట్లు దిగజారి రూ.4,50,61,658.60 కోట్ల వద్ద స్థిరపడింది.

15లో 8 ప్రతికూల సెషన్లే

నరేంద్ర మోదీ సారథ్యంలో ఇప్పటివరకు ఎన్‌డీఏ ప్రభుత్వం 15 బడ్జెట్లు ప్రవేశపెట్టగా వాటిలో బడ్జెట్‌ ప్రతిపాదించిన రోజున ఎనిమిది సందర్భాల్లో మార్కెట్‌ ప్రతికూలంగానే స్పందించింది. వాటిలో రెండు మధ్యంతర బడ్జెట్లు (2019, 2024) కూడా ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్‌ రోజున సెన్సెక్స్‌ కేవలం 5.39 పాయింట్లు లాభపడింది.

ఇవీ చదవండి:

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

Updated Date - Feb 02 , 2026 | 06:47 AM