వెండి మళ్లీ రూ.3 లక్షలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:53 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విలువైన లోహాల ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి సోమవారం ఏకంగా రూ.32,000 (11.94 శాతం) ఎగబాకి...
ఒక్కరోజులో రూ.32,000 పెరిగిన ధర
రూ.8,000 పైగా ఎగబాకి రూ.1.73 లక్షలకు చేరువైన బంగారం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విలువైన లోహాల ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి సోమవారం ఏకంగా రూ.32,000 (11.94 శాతం) ఎగబాకి రూ.3 లక్షలకు చేరుకుంది. 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం రేటు రూ.8,100 (4.92 శాతం) పెరిగి రూ.1,72,800 పలికింది. సంక్షోభ సమయాల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారం, వెండిలోకి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను మళ్లించడంతో అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్ మళ్లీ ఊపందుకుందని బులియన్ వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు ఒక దశలో 5,400 డాలర్లు దాటింది. సిల్వర్ 97.13 డాలర్లకు ఎగబాకింది.
త్వరలో 6,000 డాలర్లకు గోల్డ్: ఇరాన్పై యుద్ధం కొనసాగితే, మున్ముందు బంగారం, వెండి ధరలు మరింత ఎగబాకవచ్చని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ గోల్డ్ 6,000 డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ వెల్స్ ఫార్గో అంచనా వేసింది.
నేడు మార్కెట్లకు సెలవు: ‘హోలీ’ సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు. కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు. బుధవారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.
ఇవి కూడా చదవండి:
విండీస్పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు