Share News

ఇక చౌకగా ఏఐ సేవలు!

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:26 AM

ఆర్‌ఐఎల్‌ 49వ ఏజీఎంలో కీలక ప్రకటనలు చేసిన అంబానీ ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 49వ వాటాదారుల వార్షిక సమావేశం (ఏజీఎం) శుక్రవారం జరిగింది. దృశ్య శ్రవణ మాధ్యమంలో...

ఇక చౌకగా ఏఐ సేవలు!

కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలు, సేవల విస్తరణపై రిలయన్స్‌ ఫోకస్‌

8 శాటిలైట్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలు

  • ఆర్‌ఐఎల్‌ 49వ ఏజీఎంలో కీలక ప్రకటనలు చేసిన అంబానీ ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 49వ వాటాదారుల వార్షిక సమావేశం (ఏజీఎం) శుక్రవారం జరిగింది. దృశ్య శ్రవణ మాధ్యమంలో జరిగిన ఈ ఏజీఎంలో అంబానీ పలు కీలక ప్రకటనలు చేశారు. జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు కంపెనీ బోర్డు ఆమోదం తెలపడంతో పాటు కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతులు, సేవల విస్తరణ, శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్లోకి ప్రవేశం అందులో ప్రధానమైనవి.

జామ్‌నగర్‌లో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి

ఉచిత కాలింగ్‌, చౌక డేటా సేవల ద్వారా టెలికాం రంగం లో విప్లవాత్మక మార్పులకు తెరలేపిన రిలయన్స్‌.. ఏఐ సేవల విషయంలోనూ అదే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ మధ్యనే స్థాపించిన రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ద్వారా 2030 నాటికి ప్రతి భారతీయుడికి ఏఐ సేవలను అత్యంత అందుబాటు ధరలో అందించాలనుకుంటున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. ‘‘రిలయన్స్‌ భారత్‌ కోసం ఏఐని, భారత్‌లో ఏఐని అభివృద్ధి చేస్తోంది. ఆ ఏఐ ఒకరోజు ప్రపంచానికి సేవలందించనుంద’’ని ఏజీఎంలో అన్నారు. ప్రస్తుతం దేశంలో ఏఐకి అతిపెద్ద అవరోధాలైన.. కొరత, అధిక ధరను అధిగమించేందుకు రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో దేశీయ ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు అంబానీ తెలిపారు. కచ్‌ ప్రాంతంలోని రిలయన్స్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ద్వారా ఈ ఏఐ మౌలిక వసతికి శుద్ధ ఇంధనాన్ని అందించనున్నట్లు ఆయన చెప్పారు. తొలుత 120 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుందన్నారు. ఇందుకోసం ఎన్‌విడియాకు చెందిన జీబీ300 జీపీయూలను వినియోగించుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఇవి 75,000 హెచ్‌100 జీపీయూల సామర్థ్యంతో సమానమన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లాట్‌ఫామ్‌ కానుందన్నారు. భవిష్యత్‌లో ఈ సామర్థ్యాన్ని 2 లక్షల హెచ్‌100 జీపీయూల స్థాయికి పెంచనున్నట్లు ఆకాశ్‌ అంబానీ తెలిపారు.


5-Business.jpg

22 స్థానిక భాషల్లో ఏఐ సేవలు

దేశీయ వినియోగదారులు, వ్యాపారులకు చౌకగా, వారికి అవసరమైన రీతిలో ఏఐ సేవలను అందించనున్నట్లు ఆకాశ్‌ అంబానీ తెలిపారు. అంతేకాదు, తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ, మరాఠీ సహా 22 దేశీయ భాషల్లో యాక్సెస్‌ చేయగలిగేలా ఈ ఏఐ సేవలను డిజైన్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఏఐ పరిశోధకులు, ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే జియోకు చెందిన అన్ని యాప్‌లోన్లూ ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అంబానీ తెలిపారు. మైజియో యాప్‌ను భవిష్యత్‌లో పర్సనల్‌ ఏఐ ఏజెంట్‌, అడ్వైజర్‌, రిలేషన్‌షి్‌ప మేనేజర్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ఆకాశ్‌ చెప్పారు.

రిలయన్స్‌ ఏఐ యాప్‌లు..

జియోభారత్‌ఐక్యూ: భారత వినియోగదారులు తమ స్థానిక భాషలో ఉపయోగించుకోగలిగే సమగ్ర ఏఐ సేవల వేదిక ఏఐ వ్యాపార్‌: చిన్న వర్తకులు, వ్యాపారుల ఉత్పాదకతను, కస్టమర్‌ సేవలను మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుంది.

జియోహెల్త్‌ఐక్యూ: దేశీయ కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలందించే ఏఐ ఆధారిత వేదిక జియోలెర్న్‌ఐక్యూ: విద్యార్థులు స్థానిక భాషలో అభ్యసించేందుకు తోడ్పడే ప్లాట్‌ఫామ్‌ జియోకృషిఐక్యూ: రైతులకు వ్యవసాయం, వాతావరణానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు అందిస్తుంది.

8-Business.jpg

వారసుల చేతికి వ్యాపారాల నిర్వహణ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యాపారాల రోజు నిర్వహణ బాధ్యతలను తన వారసులకు అప్పగించే ప్రణాళిక దాదాపుగా పూర్తికావచ్చిందని ముకేశ్‌ అంబానీ తెలిపారు. ఆకాశ్‌, ఈషా, అనంత్‌ అంబానీలు ఇప్పటికే తమ కీలక వ్యాపారాలకు నేతృత్వం వహిస్తున్నారని రిలయన్స్‌ భవిష్యత్‌ వృద్ధికి కారకులు వారేనన్నారు.

శాటిలైట్‌ ఇంటర్నెట్‌

టెలికాం సేవల్లో అగ్రగామిగా ఎదిగిన రిలయన్స్‌ జియో.. ఇక శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలను సైతం చేరుకునేందుకు లో ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో) ఉపగ్రహాల ద్వారా ఈ సేవలను అందించనున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీ ఆకాశ్‌ అంబానీ ఏజీఎంలో వెల్లడించారు. తద్వారా జియో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌, అమెజాన్‌కు చెందిన లియోకు పోటీ ఇవ్వనుంది. 1,650 శాటిలైట్ల ఏర్పాటు కోసం ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పే్‌స)కు కంపెనీ ఇప్పటికే ప్రణాళికను సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి...

హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

వాన్‌‌పిక్‌ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 05:28 AM