Share News

రెపో యథాతథం

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:25 AM

ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది....

రెపో యథాతథం

  • ఎంపీసీ ఏకగ్రీవ నిర్ణయం

  • పెరిగిన వృద్ధి, ద్రవ్యోల్బణం రిస్క్‌

తటస్థ వైఖరి కొనసాగింపు.. ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక సమీక్ష విడుదల

ముంబై: ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇంధన సరఫరాలపై ఇరాన్‌ యుద్ధ ప్రభావం, ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు రెండింటికీ పెరిగిన రిస్క్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వేచి ఉండే ధోరణి అనుసరించాలని, ద్రవ్య విధానం విషయం లో తటస్థ వైఖరిని కొనసాగించాలని కూడా నిర్ణయించింది. ప్రస్తుత సంక్షుభిత వాతావరణంలో రెపో రేటును కొనసాగించాలన్నది ద్రవ్య విధాన కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల ఏకగ్రీవ నిర్ణయమని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. తాజా నిర్ణయంతో రెపో రేటు (బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూ లు చేసే వడ్డీ) 5.25ు వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతుంది. ఎంపీసీ సమావేశం సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు సాగింది. తాజా ప్రపంచ పరిస్థితులు, పశ్చిమాసియా అస్థిరతలు, రూపాయి బలహీనత, వాణిజ్య రాబడుల్లో అంతరాయాలు సహా భిన్న అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు. అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి తొలిద్వైమాసిక పరపతి విధానాన్ని మల్హోత్రా ప్రకటించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నట్టయితే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక ప్రాతిపదికన వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

క్రూడ్‌ సగటు ధర 85 డాలర్లు

2026-27 ఆర్థిక సంవత్సరంలో బ్యారెల్‌ క్రూడాయిల్‌ సగటు ధర 85 డాలర్లుండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2025-26 ద్వితీయార్ధంలో ఇది 88 డాలర్లుగా ఉంది. 2027-28 ఆర్థిక సంవత్సరానికి మాత్రం సగ టు ధర 75 డాలర్లకు పరిమితం కావచ్చు.

రూపాయి@94

అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 94 స్థాయిలో ఉండవచ్చు. 2025 అక్టోబరు నుంచి 2026 జనవరి మధ్య కాలంలో భారత కరెన్సీ సగటు విలువ 87-92 మధ్యన కదలాడింది. నవంబరు నుంచి రూపాయి విలువ క్షీణిస్తూ వచ్చి జీవిత కాల కనిష్ఠ స్థాయిలు నమోదు చేస్తూ వచ్చింది. రూపాయిపై స్పెక్యులేషన్‌ అధికంగా ఉండడమే గత 15 రోజుల్లో భారీ ఆటుపోట్లకు దారి తీసింది. ఈ పరిస్థితి నుంచి రూపాయిని ఆదుకునేందుకు తీసుకున్న చర్యలు ఎల్లకాలం కొనసాగవని ఆర్‌బీఐ పేర్కొంది. నిర్దిష్ట మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. రూపాయిపై నెట్‌ ఓపెన్‌ పొజిషన్లను (ఎన్‌ఓపీ) కట్టడి చేసిన తర్వాత ఆర్‌బీఐ చేసిన తొలి కామెంట్‌ ఇది.


ఎన్‌బీఎ్‌ఫసీలకు ప్రత్యేక

నియమావళి

టాటా సన్స్‌ లిస్టింగ్‌పై స్పష్టత లోపించిన వాతావరణంలో నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎ్‌ఫసీ)ల కోసం ఆర్‌బీఐ ఒక ప్రత్యేక నియమావళిని ప్రకటించనుంది. త్వరలోనే అది వెలువడుతుంది. అది ఎన్‌బీఎ్‌ఫసీలను వర్గీకరిస్తుంది. ఇక టాటా సన్స్‌ వ్యవహారానికి వస్తే అది ప్రైవేట్‌ కంపెనీగా కొనసాగుతుందా లేక లిస్టింగ్‌ అయి తీరాలా అన్నది ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. ఆర్‌బీఐ ప్రస్తుత నిబంధనల ప్రకారం అయితే పూర్తి ఇన్వె్‌స్టమెంట్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌ అగ్రశ్రేణిలోని 15 కంపెనీల్లో ఒకటిగా ఉన్నందు వల్ల గత ఏడాది సెప్టెంబరు 30 నాటికే లిస్టింగ్‌ కావాల్సి ఉంది. ఒక్క టాటా సన్స్‌ తప్ప మిగతా కంపెనీలన్నీ ఇప్పటికే లిస్టింగ్‌ అయ్యాయి.

ఐఎ్‌ఫఆర్‌ రద్దుకు నిర్ణయం

పెట్టుబడుల విలువలు క్షీణత నుంచి తమను తాము కాపాడుకునేందుకు అదనపు బఫర్‌గా బ్యాంకు లు నిర్వహించాల్సి ఉన్న పెట్టుబడి ఆటుపోట్ల నిధిని (ఐఎ్‌ఫఆర్‌) రద్దు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. బ్యాంకుల మూలధన నిధికి మద్దతు ఇచ్చేందుకు ఐఎ్‌ఫఆర్‌ను ఏర్పాటు చేశారు. మార్క్‌ టు మార్కెట్‌ (ఎంటీఎం) అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు ఐఎ్‌ఫఆర్‌ను నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వాణిజ్య బ్యాంకులు (లోకల్‌ ఏరియా బ్యాంకులు సహా) మార్కెట్‌ రిస్క్‌కు దీటుగా మూలధన నిల్వలు నిర్వహిస్తున్నాయి. దీనికి తోడు సవరించిన వర్గీకరణ, విలువ, పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో నిబంధనలు అనుసరిస్తున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని అలాంటి వాణిజ్య బ్యాంకులకు ఐఎ్‌ఫఆర్‌ నిబంధనను తొలగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. అలాగే ఇతర వర్గీకకరణల్లోకి వచ్చే బ్యాంకులకు కూడా ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాలను సవరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలు త్వరలో జారీ చేయనుంది.

కాల్పుల విరమణ

ఆనందదాయకం

నూతన ఆర్థిక సంవత్సరానికి తొలి ద్వైమాసిక విధాన ప్రకటనకు ముందు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్నాం. ఉదయం 5.30 సమయంలో మనకి కొంత ఆనందదాయకమైన సమాచారం అందింది. అమెరికా, ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది. అందుకే బుధవారం ఉదయమే ఎంపీసీ సమావేశమై ఆ పరిణామం గురించి చర్చించింది. కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే దానిపై సమీక్షించిన తొలి కేంద్ర బ్యాంక్‌ ఆర్‌బీఐ కావడం విశేషం.

వృద్ధి రేటు అంచనా 6.9 %

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన నూతన ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9% ఉండవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. 2025-26 సంవత్సరానికి ప్రకటించిన అంచనా 7.6% కన్నా ఇది తక్కువే. పెరిగిన కమోడిటీ ధరలు, సరఫరా అంతరాయాలు వృద్ధికి ప్రధానంగా సవాలు విసురుతున్న అంశాలని పేర్కొంది. నౌకా రవాణా జరిగే మార్గాల్లో అంతరాయాలు, పెరిగిన సరుకు రవాణా, బీమా వ్యయాల కారణంగా వాణిజ్య ఎగుమతులు ప్రభావితం కావచ్చు. అయితే సేవల రంగంలో స్థిరత్వం, జీఎ్‌సటీ రేట్ల హేతుబద్ధీకరణ ప్రభావం, తయారీ రంగంలో పెరిగిన సామర్థ్యాల వినియోగం, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ల పద్దులు ఆరోగ్యకరంగా ఉండడం దేశీయ డిమాండును ఉత్తేజితం చేస్తాయని తెలిపింది. ఆర్థిక రంగం మౌలికాంశాలు గత సంక్షుభిత సమయాలతో పోల్చితే బలంగానే ఉన్నాయి. ఈ కారణంగా ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకోగల స్థితిలో భారత ఆర్థిక రంగం ఉంది.


ద్రవ్యోల్బణం అంచనా 4.6%

కొత్త ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.6ు ఉండవచ్చు. అంటే ఆర్‌బీఐకి ప్రభు త్వం నిర్దేశించిన కట్టడి పరిధి 4 శాతం (ఎగువకు లేదా దిగువకు 2ు సద్దుబాటుతో) స్థాయిలోనే ఉంటుంది. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభం కావడానికి ముందు భారత స్థూల ఆర్థిక మౌలికాంశాలన్నీ బలంగానే ఉన్నాయి. కాని మార్చి తర్వాత ఉన్నట్టుండి పరిస్థితులు మారాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అధిక సమయం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. కాని యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు, వాతావరణ మార్పులు ఆహార వస్తువుల ధరలను పోటెత్తించడంతో ద్రవ్యోల్బణం రిస్క్‌ కూడా పెరిగింది.

తగ్గిన రుణ పత్రాలు రాబడులు

అమెరికా, ఇరాన్‌ మధ్య షరతులతో కూడిన రెండు వారాల కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారతీయ రుణ పత్రాల (బాండ్‌) రాబడులు 0.12ు మేరకు తగ్గాయి. 10 సంవత్సరాల కాలపరిమితి గల బాండ్‌ రాబడి 6.48 శాతానికి తగ్గింది. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లోనే ఇది 7.0443 శాతం నుంచి 6.8994 శాతానికి దిగి వచ్చింది.

పెట్టుబడుల గమ్యంగా భారత్‌

బలమైన స్థూల ఆర్థిక మౌలికాంశాలు, ఆకర్షణీయమైన విలువల నేపథ్యంలో పెట్టుబడుల గమ్యంగా భారత్‌కు గల ఆకర్షణ ఈ ఏడాది మెరుగుపడే ఆస్కారం ఉన్నదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పూనమ్‌ గుప్తా అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం వల్ల దేశానికి రెమిటెన్స్‌లు తగ్గే అవకాశం ఏ మాత్రం లేదని ఆర్‌బీఐ భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. రెమిటెన్స్‌ల రాక తిరిగి ప్రారంభమయ్యే రోజు త్వరలోనే ఉందని గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా కూడా అన్నారు. ‘‘ఓర్పు కలిగి ఉండి, దీర్ఘకాలికంగా సొమ్ము చేసుకోవాలనుకునే వారు తప్పకుండా భారత్‌కు తిరిగి వస్తారు. త్వరితంగా డబ్బు కావాలనుకునే వారు వస్తూ, పోతూ ఉంటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్‌పీఏలు తగ్గాయ్‌..

షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) గత ఏడాది డిసెంబరు నాటికి 2 శాతానికి తగ్గాయి. స్థూల ఎన్‌పీఏలు (90 రోజులకు పైబడి చెల్లింపు కాని రుణ బకాయిలు) గత ఏడాది ఇదే కాలంలో 2.5 శాతంగా ఉన్నాయి. రిటైల్‌ రుణాలు, సేవలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో ఆస్తుల నాణ్యత మెరుగుపడడం ఇందుకు దోహదపడినట్టు ఆర్‌బీఐ విడుదల చేసిన ద్రవ్య విధాన నివేదిక తెలిపింది.

ఆర్‌బీఐ ప్రకటించిన అంచనాలు...

త్రైమాసిక కాలం వృద్ధి రేటు ద్రవ్యోల్బణం

ఏప్రిల్‌-జూన్‌ 6.8% 4%

జూలై-సెప్టెంబరు 6.7% 4.4%

అక్టోబరు-డిసెంబరు 7% 5.2%

జనవరి-మార్చి 7.2% 4.7%

2026-27 మొత్తానికి 6.9% 4.6%

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 04:26 AM