వాట్సాప్ సీఈఓగా క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్
ABN , Publish Date - Jun 22 , 2026 | 08:50 PM
వాట్సాప్కు సీఈఓగా క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షాను ఎంపిక చేసినట్టు మెటా తాజాగా ప్రకటించింది. వాట్సాప్కు నాయకత్వం వహించేందుకు ఆయన తగిన వ్యక్తి అని వ్యాఖ్యానించింది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ టెక్ రంగంలో మరో భారతీయుడికి కీలక బాధ్యతలు దక్కాయి. క్రెడ్ సంస్థ వ్యవస్థాపకుడు కునాల్ షాను వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా ఎంపిక చేశామని మెటా తాజాగా ప్రకటించింది. విల్ కాత్కార్ట్ తరువాత సీఈఓ బాధ్యతలను కునాల్ స్వీకరిస్తారని తెలిపింది. మెసేజింగ్ యాప్గా మొదలైన వాట్సాప్ ప్రయాణం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కునాల్కు నాయకత్వ బాధ్యతలు దక్కడం టెక్ ప్రపంచంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
2019లో కునాల్ క్రెడ్ సంస్థను స్థాపించారు. అంచలంచెలుగా సంస్థను అభివృద్ధి చేశారు. ఇటీవలే సంస్థ లాభాల బాట పట్టింది. ఆంత్రప్రెన్యూర్గా, కొత్త ఉత్పత్తుల రూపశిల్పిగా విశేష అనుభవం కలిగిన కునాల్ వాట్సాప్కు మార్గనిర్దేశనం చేసేందుకు తగిన వ్యక్తి అని మెటా పేర్కొంది. క్రెడ్ను కునాల్ భారత్లో అత్యంత ముఖ్య టెక్ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారని ప్రశంసించింది. టెక్ ప్రపంచంపై ఆయనకు గొప్ప అవగాహన ఉందని పేర్కొంది. వాట్సాప్ విషయంలో ఆయనకున్న అభిప్రాయాల దృష్ట్యా నాయకత్వ బాధ్యతలు అప్పగించామని మెటా చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ క్రిస్ తెలిపారు.
క్రెడిట్ కార్డుల బిల్లులను సమయానికి చెల్లించే యూజర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో షా క్రెడ్ను ప్రారంభించారు. యూజర్ల ఆదరణతో క్రమక్రమంగా విస్తరించిన క్రెడ్కు ప్రస్తుతం 17 మిలియన్ సభ్యులు ఉన్నారు. చెల్లింపులు, రుణాలు, వాణిజ్య సేవలు, వెల్త్ మేనేజ్మెంట్, క్రెడిట్ కార్డుల విభాగాల్లోకి కూడా క్రెడ్ విస్తరించింది. ఇక వ్యక్తిగత మెసేజింగ్ యాప్గా ప్రయాణం ప్రారంభించిన వాట్సాప్ ప్రస్తుతం వాణిజ్య అవసరాలకు కూడా కీలకంగా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం దిగుమతులు 70 శాతం డౌన్