అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:53 PM
ఇటీవల అప్పు చేసి మరీ పసిడిపై పెట్టుబడి పెట్టిన ఓ వ్యక్తి భారీ స్థాయిలో నష్టపోయిన ఉదంతం నెట్టింట వైరల్గా మారింది. అత్యాశకు పోతే ఏం జరుగుతుందో తెలియజేసే చక్కటి ఉదాహరణ ఇదని పోస్టు పెట్టిన వ్యక్తి కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు పలువురు రిటైల్ ఇన్వెస్టర్ల (Retail Investor Loss) జీవితాలను తలకిందులు చేశాయి. రేట్లు పెరుగుతూనే ఉంటాయన్న అంచనాతో అప్పు చేసి మరీ పసిడి కొన్నవారికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది (Gold Price Crash). ఈ నేపథ్యంలో ఆదిత్య షా అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ నెట్టింట ఓ పోస్టు పెట్టారు. తన దృష్టికి వచ్చి ఓ షాకింగ్ ఉదంతాన్ని షేర్ చేశారు. అత్యాశకు పోతే నష్టాలు తప్పవని హెచ్చరించారు.
ఇటీవల తనకు తెలిసిన ఓ వ్యక్తి క్రెడిట్ కార్డుపై గరిష్ఠ పరిమితి వరకూ లోన్ తీసుకుని బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాడని ఆదిత్య తెలిపారు. మొత్తం రూ.10 లక్షల పెట్టుబడి పెట్టాడని అన్నారు. నెల రోజుల్లో తన డబ్బుపై 10-12 శాతం రాబడి పక్కా అని బలంగా నమ్మి రిస్క్ తీసుకున్నాడని పేర్కొన్నారు. కానీ, జనాలు ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో బంగారం, వెండి ధరలు రెండు రోజుల వ్యవధిలోనే దారుణంగా పడిపోయాయి. దీంతో పెట్టుబడి పెట్టిన వ్యక్తి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అత్యాశ ఫలితంగా సదరు వ్యక్తికి నష్టాలు, అప్పులు, భారీ క్రెడిట్ కార్డు బిల్లుతో తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అత్యాశకు పోయేవారికి కనువిప్పు కలిగించే ఉదాహరణ ఇదని వ్యాఖ్యానించారు (Rs.10 Lakh Investment Loss).
పెట్టుబడులపై రిస్క్ను తగ్గించే ప్రణాళిక, మార్కెట్ నుంచి సరైన సమయంలో తప్పుకునేందుకు వ్యూహం లేకపోతే ఇలాంటి నష్టాలే ఎదురవుతాయని పలువురు కామెంట్ చేశారు. సంపద కూడబెట్టేందుకు ఏళ్లకు ఏళ్లు గడిచిపోతే నష్టపోయేందుకు క్షణకాలం చాలని గుర్తు చేశారు. రిస్కీ పెట్టుబడుల విషయంలో ఈ సూత్రం మర్చిపోవద్దని హెచ్చరించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్గా మారింది.
ఇవీ చదవండి:
బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..