Share News

సత్తా చాటిన ఇన్ఫోసిస్‌

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:28 AM

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మరోసారి తన సత్తా చాటింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.46,402 కోట్ల ఆదాయంపై...

సత్తా చాటిన ఇన్ఫోసిస్‌

  • క్యు4 లాభం రూ.8,501 కోట్లు

  • ఒక్కో షేరుపై రూ.25 డివిడెండ్‌

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మరోసారి తన సత్తా చాటింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.46,402 కోట్ల ఆదాయంపై రూ.8,501 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే ఆదాయం 13.4ు, నికర లాభం 20.8ు పెరిగాయి. డిసెంబరు త్రైమాసికంతో పోల్చినా కంపెనీ ఆదాయం రెండు శాతం, నికర లాభం 28ు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ రూ.1,78,650 కోట్ల ఆదాయంపై రూ.29,440 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలి స్తే ఆదాయం 9.6ు, నికర లాభం 10.20ు పెరిగాయి. దీంతో వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.25 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని గురువారం సమావేశమైన ఇన్ఫోసిస్‌ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

1,490 కోట్ల డాలర్ల డీల్స్‌ : డీల్స్‌ పరంగా కూడా 2025-26 ఆర్థిక సంవత్సరం ఇన్ఫోసి్‌సకు బాగానే కలిసొచ్చింది. ఈ కాలానికి కంపెనీ 1,490 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.4 లక్షల కోట్లు) విలువైన కొత్త డీల్స్‌ సంపాదించింది. ఇందులో 320 కోట్ల డాలర్ల విలువైన డీల్స్‌ క్యూ4లో సంపాదించినట్టు తెలిపింది. ఏఐ నేపథ్యంలో అమెరికా, యూరప్‌ దేశాల్లోని కంపెనీలు ఐటీ ఖర్చులు తగ్గించుకుంటున్న సమయంలోనూ ఇన్ఫోసిస్‌ ఇంత భారీ స్థాయిలో కొత్త డీల్స్‌ సంపాదించడం విశేషం. కస్టమర్లకు విస్తృత స్థాయిలో ఏఐ ఆధారిత సేవలు అందించడమే ఇందుకు ప్రధాన కారణమని కంపె నీ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ చెప్పారు.


8,440 మంది ఔట్‌: ఇక క్యూ4లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 8,440 తగ్గి 3,28,598కు చేరింది. ఆరు త్రైమాసికాల కాలంలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. డిసెంబరు త్రైమాసికంలో 12.3 శాతంగా ఉన్న ఉద్యోగుల వలస రేటు మార్చి త్రైమాసికంలో 12.6 శాతానికి చేరడం ఇందుకు ప్రధాన కారణం. అయితే క్యూ4లో తమ ఉద్యోగుల సంఖ్య 5,000 వరకు పెరిగినట్టు ఇన్ఫోసిస్‌ సీఎ్‌ఫఓ జయేశ్‌ సంగ్రాజ్‌కా చెప్పారు.

షేర్లు డీలా : గురువారం వెలువడిన ఇన్ఫోసిస్‌ క్యూ4 ఆర్థిక ఫలితాలు దలాల్‌ స్ట్రీట్‌ను పెద్దగా మెప్పించలేక పోయాయి. దీంతో బీఎ్‌సఈలో కంపె నీ షేర్లు 2.04 శాతం నష్టపోయి రూ.1,242.60 వద్ద ముగిశాయి.

20,000 మంది ఫ్రెషర్స్‌కు అవకాశం

2026-27 ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్టు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా కంపెనీ ఇదే స్థాయిలో ఫ్రెషర్లకు అవకాశం కల్పించింది.

ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 24 , 2026 | 05:28 AM