భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:46 PM
గత రెండ్రోజులుగా లాభపడుతూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం ఉదయం నష్టాల బాటలో సాగాయి. ఒక దశలో భారీగా నష్టపోయాయి. అయితే చివర్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో అనూహ్యంగా పుంజుకున్నాయి.
గత రెండ్రోజులుగా లాభపడుతూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం ఉదయం నష్టాల బాటలో సాగాయి. ఒక దశలో భారీగా నష్టపోయాయి. అయితే చివర్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే 800 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. చాలా రోజుల తర్వాత విదేశీ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, మెటల్ ఇండెక్స్ లాభాలను ఆర్జించడంతో సూచీలు కోలుకున్నాయి. దీంతో సెనెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (82,344)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్గా మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే చలించింది. ఒక దశలో దాదాపు 600 పాయింట్లు కోల్పోయి 81, 707 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత నష్టాల నుంచి కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 221 పాయింట్ల లాభంతో 82,566 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 76 పాయింట్ల లాభంతో 25,418 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్లో ఏబీబీ ఇండియా, నాల్కో, ఆయిల్ ఇండియా, టాటా స్టీల్, అదానీ గ్రీన్ ఎనర్జీ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కేపీఐటీ టెక్నాలజీస్, కెనరా బ్యాంక్, సోలార్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 359 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 102 పాయింట్లు లాభపడింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.95గా ఉంది.
ఇవి కూడా చదవండి..
విచిత్రం, 1966లో తులం బంగారం కంటే తాజ్ హోటల్లో బస చేయడమే ఎక్కువ ఖరీదు..
మీ కళ్ల షార్ప్నెస్కు టెస్ట్.. ఈ ఫొటోలో బల్లిని 15 సెకెన్లలో కనిపెట్టండి..