5న హైసియా వార్షిక సదస్సు
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:39 AM
హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఈ నెల 5న హైదరాబాద్లో 33వ ఎడిషన్ వార్షిక సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం నాడు హెచ్ఐసీసీలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఈ నెల 5న హైదరాబాద్లో 33వ ఎడిషన్ వార్షిక సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం నాడు హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ఈ సదస్సుకు 100 మంది ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో పాటు 1,200 మంది డెలిగేట్లు పాల్గొంటారని హైసియా ప్రెసిడెంట్ ప్రశాంత్ నందెళ్ల వెల్లడించారు. ఇంటలిజెంట్ సిస్టమ్స్, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్, డీప్ టెక్నాలజీలు, టాలెంట్ మోడల్స్ వంటి వాటిపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారని ఆయన తెలిపారు. అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ప్రొడక్ట్ కంపెనీలు, సర్వీస్ సంస్థలు, స్టార్టప్స్, రీసెర్చ్ సంస్థల ప్రతినిధులు కూడా అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ను మరింత కీలకంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చిస్తారని హైసియా వైస్ ప్రెసిడెంట్ బిపిన్ పెండ్యాల పేర్కొన్నారు.
ఐటీ ఎగుమతులు రూ.3.12 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ.3.12 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రశాంత్ తెలిపారు. అయితే ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే గణాంకాల్లో కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం హైదరాబాద్లో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. పశ్చిమాసియా సంక్షోభం దేశీయ ఐటీ పరిశ్రమపై అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు ప్రశాంత్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
విండీస్పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు