Share News

కస్టమర్ల డేటాకు ఫిన్‌టెక్‌లు ధర్మకర్తలే..

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:20 AM

ఆర్థిక సేవల వ్యవస్థలో నమ్మకమే విజయానికి కీలకమని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) కంపెనీలు తమ...

కస్టమర్ల డేటాకు ఫిన్‌టెక్‌లు ధర్మకర్తలే..

  • అంతే తప్ప వ్యాపార ఆస్తి కాదు..

  • ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా

ముంబై: ఆర్థిక సేవల వ్యవస్థలో నమ్మకమే విజయానికి కీలకమని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) కంపెనీలు తమ వద్ద నిక్షిప్తమైన కస్టమర్ల డేటాకు ధర్మకర్తల్లా వ్యవహరించాలే తప్ప అది వ్యాపార ఆస్తి కాదన్నారు. ఫిన్‌టెక్‌ సంస్థలు తమ వద్దనున్న డేటాను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ముంబైలో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2026’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక సేవల భవిష్యత్‌ నిర్మాణంలో భారత్‌ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగే అవకాశం ఉందని నొక్కి చెప్పారు. భవిష్యత్‌ తరం ఆర్థిక సేవల కోసం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించేందుకు ఆర్‌బీఐ కసరత్తు చేస్తోందన్నారు. డిజిటల్‌ చెల్లింపులకు వెన్నెముక అయిన యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) తరహాలో ఏకీకృత రుణ మంజూరు వ్యవస్థ యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫే్‌స (యూఎల్‌ఐ)ను ఇందుకు ఉదాహరణగా చెప్పారు. కాగా, యూనిఫైడ్‌ ఫిన్‌టెక్‌ ఫోరమ్‌ను ఆర్థిక సేవల రంగానికి రెండో స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్‌ఆర్‌ఓ)గా ప్రకటించారు.

యూపీఐ ట్యాప్‌ అండ్‌ పే: గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ సదస్సులో ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా యూపీఐ ట్యాప్‌ అండ్‌ పే, మైయూపీఐ ఫీచర్లను సైతం విడుదల చేశారు. యూపీఐ ట్యాప్‌ అండ్‌ పే విధానంలో వినియోగదారులు ఎన్‌ఎఫ్‌సీ (నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) ఫీచర్‌ కలిగిన తమ స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్‌ చేయడం ద్వారా మర్చంట్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) టెర్మినల్‌ వద్ద వేగంగా చెల్లింపులు జరుపవచ్చు. ఈ ఫీచర్‌ వినియోగదారుల మొబైల్‌ ఇంటర్నెట్‌పై ఆధారపడదు. పీఓఎస్‌ మెషీన్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌తోనే చెల్లింపును పూర్తి చేయవచ్చు. కాగా, యూపీఐ హెల్ప్‌ను మేధోపరంగా మరింత మెరుగుపరిచేందుకు ఎన్‌పీసీఐ స్మాల్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఫిమీ)పై అభివృద్ధి చేసిన ఏఐ పవర్డ్‌ ప్లాట్‌ఫామ్‌ మైయూపీఐ.


డీమ్యాట్‌ 2.0 విడుదల

సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే, ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా కలిసి ఈ సదస్సులో డీమ్యాట్‌ 2.0ను విడుదల చేశారు. కార్పొరేట్‌ బాండ్ల టోకనైజేషన్‌ పైలట్‌ ప్రాజెక్టులో భాగం గా దీన్ని విడుదల చేశారు. ఆర్‌బీఐకి చెందిన యూనిఫైడ్‌ మార్కెట్‌ ఇంటర్‌ఫే్‌స (యూఎంఐ) ద్వారా హోల్‌సేల్‌ సీబీడీసీ (సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ)తో ఈ డీమ్యాట్‌ 2.0 అనుసంధానితమై ఉంటుంది. ఎందుకంటే, ఈ టోకనైజ్డ్‌ బాండ్లను ఆర్‌బీఐ హోల్‌సేల్‌ సీబీడీసీ ద్వారానే ఈ బాండ్లను కొనుగోలు చేసే వీలుంటుంది. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ద్వారా ఈ టోకనైజ్డ్‌ బాండ్లను జారీ చేస్తారు. బాండ్ల జారీ, వాటి హక్కుదారుతో పాటు బాండ్ల ట్రేడింగ్‌, సెటిల్‌మెంట్‌ వంటి వివరాలను బ్లాక్‌ చెయిన్‌ లెడ్జర్‌లో డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఇప్పటికే మూడు కంపెనీలు (ఆర్‌ఈసీ, ఎల్‌ అండ్‌ టీ, ఐఐఎ్‌ఫఎల్‌) రూ.1,025 కోట్ల టోకనైజ్డ్‌ బాండ్లను జారీ చేశాయి.

ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 11 , 2026 | 05:20 AM