ఆర్థిక సేవల రంగంలో భారీ జీతాలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:12 AM
నిపుణులైన ఉద్యోగులకు ఆర్థిక సేవల రంగం భారీ జీతాలు ఆఫర్ చేస్తోంది. ఈ రంగంలో మంచి అనుభవం, వృత్తి నైపుణ్యాలు ఉన్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల...
సీఎఫ్ఓ కోసం కంపెనీల వేట
ఏడాదికి రూ.8 కోట్ల వరకు ప్యాకేజీలు
న్యూఢిల్లీ: నిపుణులైన ఉద్యోగులకు ఆర్థిక సేవల రంగం భారీ జీతాలు ఆఫర్ చేస్తోంది. ఈ రంగంలో మంచి అనుభవం, వృత్తి నైపుణ్యాలు ఉన్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్ఓ) వంటి నిపుణులకు రూ.10,000 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు ఏడాదికి రూ.8 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఇలాంటి కంపెనీల్లో సీఎఫ్ఓల వార్షిక జీతాలు రూ.1.75 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఉన్నాయి. ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు కూడా ఆర్థిక సేవల రంగంలో పట్టున్న సీనియర్లకు రూ.60 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు వార్షిక ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఈ సంస్థల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులు వార్షిక ప్యాకేజీలైతే రూ.1.3 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఉన్నాయి. డైరెక్టర్ల స్థాయి ఉద్యోగులూ ఏటా సగటున రూ.1.85 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల వరకు జేబుల్లో వేసుకుంటున్నారు. ఇక ఎండీ స్థాయి వారికైతే కంపెనీలు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీలకు నియామకాల సేవలందించే మైఖేల్ పేజ్ సంస్థ విడుదల చేసిన ‘ఇండియా సాలరీ గైడ్- 2026’ నివేదిక ఈ విషయం తెలిపింది. దేశంలో ఏర్పాటవుతున్న జీసీసీలు, ఏఐ నైపుణ్యాలకు పెరిగిన గిరాకీ ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
వీరికి మరింత గిరాకీ
కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, ఈవీలు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగాల్లో నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు మరింత డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి నిపుణులు దొరికితే కంపెనీలు మిగతా ఉద్యోగుల కంటే 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఈ డొమైన్స్పై మంచి పట్టున్న ఉద్యోగులు అధిక జీతాల కోసం వెంట వెంటనే ఉద్యోగులు మారుతున్నట్టు మైఖేల్ పేజ్ నివేదిక తెలిపింది.
ఇవి కూడా చదవండి..
నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..