Share News

తెలుగు రాష్ట్రాల్లో సిమంట!

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:08 AM

తెలుగు రాష్ట్రాల మార్కెట్లో మరో విడత ధరలు పెంచేందుకు సిమెంట్‌ కంపెనీలు సిద్ధమయ్యాయి. 50 కిలోల బ్యాగ్‌పై ఈ పెంపు రూ.35 నుంచి రూ.45 వరకు ఉండే అవకాశం...

తెలుగు రాష్ట్రాల్లో సిమంట!

  • రూ.45 వరకు పెరగనున్న బ్యాగు ధర

  • ఉత్పత్తి ఖర్చులే కారణమంటున్న కంపెనీలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలుగు రాష్ట్రాల మార్కెట్లో మరో విడత ధరలు పెంచేందుకు సిమెంట్‌ కంపెనీలు సిద్ధమయ్యాయి. 50 కిలోల బ్యాగ్‌పై ఈ పెంపు రూ.35 నుంచి రూ.45 వరకు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఒక ప్రధాన సిమెంట్‌ కంపెనీ ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం బ్యాగ్‌ సిమెంట్‌ ధర హోల్‌సేల్‌ మార్కెట్‌లో బ్రాండ్‌ను బట్టి రూ.250 నుంచి రూ.280 మధ్య పలుకుతోంది. రిటైల్‌ మార్కెట్‌లోనూ బ్యాగ్‌ రేటు రూ.270 నుంచి రూ.310 మధ్య ఉంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో బ్యాగ్‌ ధర కనీసం రూ.320 ఉంటే తప్ప తమకు గిట్టుబాటు కాదని ఒక కంపెనీ డైరెక్టర్‌ చెప్పారు. ఈ నెల 5వ తేదీ నుంచే ధరల పెంపు అమల్లోకి వస్తుందని కంపెనీల నుంచి తమకు సమాచారం అందినట్టు కొంత మంది డీలర్లు చెప్పారు. అయితే ధర పెంచడం ఖాయమైనా, ఎప్పటి నుంచి అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ పెంపు ఉంటుందని ఒక కంపెనీ డైరెక్టర్‌ చెప్పారు. దీంతో పండగల సీజన్‌కు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్తా సిమెంట్‌ ధర రూ.35 నుంచి రూ.45 వరకు పెరగనుంది.

ముడిసరుకులు ప్రియం

ప్రధాన ముడిసరుకుల ధరలు పెరిగిపోయినందున సిమెంట్‌ ధరలు పెంచక తప్పడంలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత 6-7 నెలల్లోనే టన్ను పెట్రో కోక్‌ ధర 110 డాలర్ల నుంచి 150 డాలర్లకు పెరిగిందని ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గుర్తు చేశారు.

డిమాండ్‌కు ఢోకా లేదు..

ఽధరలు పెంచినా అమ్మకాలకు ఢోకా ఉండదని కంపెనీలు భావిస్తున్నాయి. దసరా నుంచి అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాల అంచనా. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ప్రతి నెలా 32 నుంచి 35 లక్షల టన్నుల వరకు సిమెంట్‌ అమ్ముడవుతోంది. దసరా నుంచి ఇది 38 లక్షల టన్నుల వరకు చేరే అవకాశం ఉందని పరిశ్రమవర్గాల అంచనా.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:08 AM