త్వరలో అమల్లోకి రానున్న పాన్ కార్డు నిబంధనలు ఇవేనా!
ABN , Publish Date - Feb 21 , 2026 | 09:15 AM
ఇటీవల సీబీడీటీ విడుదల చేసిన ముసాయిదా నిబంధనలపై ప్రజాభిప్రాయం తెలిపేందుకు రేపే చివరి రోజు. ఈ నేపథ్యంలో సీబీడీటీ ముసాయిదా నిబంధనల ఏమిటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు రేపే చివరి రోజు. అనంతరం, ప్రజాభిప్రాయాల మేరకు మార్పులతో ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇటీవల ప్రకటించిన నిబంధనలు ఏవో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం (CBDT Draft Rules).
పాన్ కార్డుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను సీబీడీటీ ఇటీవల విడుదల చేసింది. వీటి ప్రకారం, బ్యాంక్ అకౌంట్లల్లో నగదు డిపాజిట్, విత్డ్రాల్ విలువ ఒక ఏడాదిలో రూ.10 లక్షలకు మించితే వినియోగదారులు పాన్ కార్డు వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఒక్క రోజులో బ్యాంక్ అకౌంట్లో రూ.50 వేలకు మించి నగదు జమచేయాలంటే పాన్ కార్డు వివరాలను అధికారులకు అందజేయడం తప్పనిసరి. రూ.5 లక్షలకు మించి ధర కలిగిన వాహనాల కొనుగోలు సమయంలోనూ పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
రెస్టారెంట్ చార్జీలు రూ.1లక్ష దాటిన సందర్భాల్లో కూడా కస్టమర్ల పాన్ కార్డు వివరాలను రెస్టారెంట్ యాజమాన్యాలు సంబంధిత బిల్లుల్లో ప్రస్తావించాల్సి ఉంటుంది. గతంలో ఈ పరిమితి రూ.50 వేలుగా ఉండేది. కాన్సర్ట్లు, ఎగ్జిబిషన్స్, స్పోర్ట్ ఈవెంట్స్ నిర్వహణ సేవలు అందించే సంస్థలు కూడా తమ వినియోగదారుల పాన్ వివరాలను కోట్ చేయాలి. రూ.20 లక్షలు మించిన ఆస్తులను విక్రయించినప్పుడు కూడా ప్రజలు పాన్ కార్డు వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, మెట్రోపాలిటన్ నగరాలు మినహా ఇతర ప్రాంతాల్లో ఉండేవారికి ఈ పరిమితి విషయంలో కొంత వెసులుబాటును కల్పించారు.
ఇన్సూరెన్స్కు సంబంధించి తాజా నిబంధనల ప్రకారం, ఏటా చెల్లించే ప్రీమియం రూ.5 లక్షలు దాటినప్పుడు కంపెనీలు వినియోగదారుల పాన్ కార్డు వివరాలను తీసుకోవాలి. కానీ తాజా నిబంధనల ప్రకారం, ఇన్సురెన్స్కు సంబంధించిన అన్ని సందర్భాల్లో వినియోగదారులు తమ పాన్ వివరాలను ఇవ్వడం తప్పనిసరి. ఇక ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం మార్చి నాటికి ఈ నిబంధనలకు సీబీడీటీ తుది రూపు ఇచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ
10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్