Share News

యస్ చెబితేనే నగదు బదిలీ.. యూపీఐ కొత్త ఫీచర్‌కు ప్రతిపాదన

ABN , Publish Date - Aug 03 , 2026 | 10:48 AM

డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు కొత్త ఫీచర్‌ను ప్రతిపాదించాయి. యూపీఐ ట్రాన్సాక్షన్‌‌కు సంబంధించి ‘యస్’ ఆప్షన్‌ను ఎంచుకున్నాకే నగదు బదిలీ అయ్యేలా కొత్త ఫీచర్‌ అమల్లోకి తేవాలని ప్రతిపాదించాయి.

యస్ చెబితేనే నగదు బదిలీ.. యూపీఐ కొత్త ఫీచర్‌కు ప్రతిపాదన
UPI New Feature for High Risk Transactions

ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు కొత్త ఫీచర్‌ను ప్రతిపాదించాయి. యూపీఐ ట్రాన్సాక్షన్‌‌కు సంబంధించి ‘యస్’ ఆప్షన్‌ను ఎంచుకున్నాకే నగదు బదిలీ అయ్యేలా కొత్త ఫీచర్‌ అమల్లోకి తేవాలన్న ప్రతిపాదనను ఆర్బీఐ ముందుంచినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం బయోమెట్రిక్ ఆథెంటికేషన్, లేదా పిన్ నంబర్ ఎంటర్ చేశాక నగదు బదిలీ జరుగుతోంది. దీనికి అదనంగా యస్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తే భద్రత మరింత పెరుగుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే, హైరిస్క్ లావాదేవీలకు మాత్రమే ఈ ఫీచర్ వర్తింప చేస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. ఈ అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది.


ఫీచర్ పనితీరు ఇలా..

అనుమానాస్పదంగా ఉన్న నగదు బదిలీని బ్యాంకుల్లోని ఫ్రాడ్ డిటెక్షన్ ఇంజన్‌లు గుర్తిస్తాయి. అనంతరం కస్టమర్‌ ఫోన్‌లో ఒక పాప్ అప్ విండో ప్రత్యక్షం అవుతుంది. బదిలీకి అనుమతించేందుకు యస్ ఆప్షన్, వద్దనేందుకు నో ఆప్షన్ ఈ విండోలో ఉంటాయి. యస్ ఆప్షన్‌ను ఎంచుకున్నాకే నగదు బదిలీ పూర్తవుతుంది. బ్యాంకు దృష్టిలో హైరిస్క్‌ లావాదేవీలకు మాత్రమే వర్తించేలా ఈ ఫీచర్‌ను డిజైన్ చేయనున్నారు.

కొత్త మార్గాల్లో సైబర్ నేరాలు..

ఇటీవల కాలంలో యూపీఐ చెల్లింపులకు సంబంధించి మోసాలు పెరుగుతున్న వైనాన్ని బ్యాంకులు గుర్తించాయి. నేరగాళ్లు హ్యాకింగ్‌కు బదులు బాధితుల్ని ప్రభావితం చేసి డబ్బుల్ని దండుకోవడానికి అలవాటు పడ్డారు. ఫోన్ కాల్స్, మెసేజీ యాప్‌ల ద్వారా యూజర్లను సంప్రదించి తక్షణ బదిలీకి ఒత్తిడి చేసి డబ్బును దోచుకుంటున్నారు. చాలా సందర్భాల్లో నగదు అకౌంట్ నుంచి బదిలీ అయ్యాక తిరిగి పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో, బాధితులు మోసం జరిగిందని గుర్తించే సరికి చాలా ఆలస్యం జరుగుతోంది.


ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తే వారు క్షణకాలం పాటైనా ఆగి తమ చర్యలను పునఃసమీక్షించుకుని తగు నిర్ణయం తీసుకుంటారని బ్యాంకులు భావిస్తున్నాయి. వేగవంతమైన నగదు బదిలీల కారణంగా యూపీఐ అందరికీ చేరువైంది. కాబట్టి, యూపీఐకి ఉన్న జనాదరణ తగ్గకుండా ఉండేందుకు హైరిస్క్ ట్రాన్సాక్షన్స్‌కే ఈ ఫీచర్‌ను వర్తించాలని బ్యాంకులు భావిస్తున్నట్టు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

ఏఐ వల్లే ఐటీలో హైరింగ్‌ తగ్గింది..

భారత్‌లో పెరిగిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు.. జులైలో రూ.20,200 కోట్లు..

Updated Date - Aug 03 , 2026 | 12:27 PM