ఏఐతో ‘సాంప్రదాయ ఐటీ’కి భంగం
ABN , Publish Date - May 08 , 2026 | 01:58 AM
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత విస్త్రత వినియోగంతో సాంప్రదాయ ఐటీ సేవల విధానానికి అంతరాయం కలిగినప్పటికీ, ఇది ఐటీ ఇండస్ట్రీని...
అయినా ఐటీ పరిశ్రమ పదిలం
కోఫోర్జ్ సీఈఓ సుధీర్ సింగ్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత విస్త్రత వినియోగంతో సాంప్రదాయ ఐటీ సేవల విధానానికి అంతరాయం కలిగినప్పటికీ, ఇది ఐటీ ఇండస్ట్రీని కుదించదని నోయిడాకు చెందిన ఐటీ కంపెనీ కోఫోర్జ్ సీఈఓ సుధీర్ సింగ్ అన్నారు. అంతేకాదు, ఐటీ కంపెనీలకు ఏఐ టెక్నాలజీ అధిక మార్జిన్తో కూడిన కాంట్రాక్టులను అందిస్తోందన్నారు. ఏఐతో కోడింగ్ చవకే అయినప్పటికీ, దాని నిర్వహణ, భద్రతతో పాటు సొంతం చేసుకోవడం ఖరీదైన విషయమని అన్నారు. ‘‘20 ఏళ్ల క్రితం క్లౌడ్ మైగ్రేషన్ లాగే, ఏజెంట్ ఏఐ భారీ స్థాయి సేవలను అందించగలిగినప్పటికీ, వాటి ఉత్పత్తిని ఎవరైనా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏజెంట్లకు పునఃశిక్షణ అందించాలి. పాలన ప్రమాణాలకు భంగం కలుగకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంద’’ని సింగ్ పేర్కొన్నారు. టెక్నాలజీ సేవలపై ఏఐ ప్రభావానికి సంబంధించి ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఐటీ ఇండస్ట్రీకి ఏఐ కొత్త సేవల విభాగాలను శరవేగంగా సృష్టిస్తోంది. 16,000 -18,000 కోట్ల డాలర్ల మేర మార్కెట్ అవకాశాలను కల్పిస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ మార్కెట్ విలువ 35 శాతం చొప్పున వృద్ధి చెంది 80,000 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోగలదని త్రైమాసిక ఫలితాల సందర్భంగా విడుదల చేసిన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో కోఫోర్జ్ అంచనా వేసింది.
గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఏఐ టెక్నాలజీలో 55 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టిందీ సంస్థ. అంతేకాదు, తమ ఆదాయ వృద్ధి, మార్జిన్ల పెరుగుదలతో ఏఐ గణనీయ పాత్ర పోషిస్తోందని కంపెనీ పేర్కొంది. 2025-26లో కోఫోర్జ్ నికర లాభం దాదాపు రెండింతలై రూ.1,555.7 కోట్లకు చేరుకుంది. ఆదాయం 35.8 శాతం వృద్ధితో 16,402.7 కోట్లకు పెరిగింది.
ఇవి కూడా చదవండి..
భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..