నమ్మకద్రోహిని అయితే అప్పుడే అప్రూవర్గా మారేవాడిని: విజయసాయిరెడ్డి
ABN , Publish Date - Aug 29 , 2026 | 02:43 PM
వైసీపీలో తనపై జరుగుతున్న ప్రచారానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనను నమ్మకద్రోహిగా చిత్రీకరిస్తున్న ‘కోటరీ’ నాయకులే జగన్కు అసలు వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఆరోపించారు.
అమరావతి, ఆగస్టు 29: వైసీపీలో తనపై జరుగుతున్న ప్రచారానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నమ్మకద్రోహిని అయితే అప్పుడే అప్రూవర్గా మారేవాడిని అని అన్నారు. తనపై వైసీపీకి చెందిన ‘కోటరీ’ నాయకులు సోషల్ మీడియాలో నమ్మకద్రోహి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాను జగన్కు నమ్మకస్తుడిగా ఉన్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తనను జగన్తో పాటు పలు CBI, ED చార్జ్షీట్లలో A2గా చేర్చిందని పేర్కొన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే, తాను 15 నెలలు జైలు జీవితం గడిపానని, తనలో నమ్మకద్రోహం ఉంటే అప్పుడే అప్రూవర్గా మారేవాడినని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల తర్వాత తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్ కేసులో A5గా, కాకినాడ సీ పోర్ట్ కేసులో A2గా చేర్చారని విజయసాయి ఆరోపించారు.
2019 ఎన్నికల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం పార్టీలో పెరిగిందని.. ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని విజయసాయిరెడ్డి విమర్శించారు. జగన్ను ఎవరూ కలవకుండా అడ్డుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు ఆయనకు దూరం కావడానికి కూడా సజ్జలే కారణమని ఆరోపించారు. ‘కోటరీ’ నాయకుడి వల్ల అవమానాలు భరించలేక.. ఆత్మగౌరవాన్ని చంపుకొని పార్టీలో కొనసాగలేక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. జగన్కు వెన్నుపోటు పొడిచి కేసులు లేకుండా చేసుకోవడం తనకు తెలియదని, కోవర్టు రాజకీయాలు తనకు చేతకావని స్పష్టం చేస్తూ.. ‘కోటరీ’ నాయకుడి చేతిలో జగన్ బందీ అయ్యారని విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..