అనంతబాబు కేసులో పోలీసులపై వేటు
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:19 AM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కుమ్మక్కు అయ్యారంటూ సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో...
సుప్రీం కోర్టు ఆగ్రహంతో నలుగురు సస్పెన్షన్
కాకినాడ, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కుమ్మక్కు అయ్యారంటూ సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. 2022, మే 19న జరిగిన హత్య కేసు విచారణలో నిందితుడైన అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణలో లోపాలపై శుక్రవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు డిఫాల్ట్ బెయిల్ అందించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయని, అత్యంత హేయమైన నేరంలో పోలీసుల తీరు ఆక్షేపణీయమని సుప్రీం కోర్టు మండిపడింది. కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నిందితులకు కొమ్ము కాసిన పోలీసులపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. అప్పటి పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో కేసులో కీలక ఆధారాలు కావాలని విస్మరించి నిందితుడైన అనంతబాబుకు సహకరించిన నలుగురు పోలీస్ అధికారులపై డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
సస్పెండ్ అయిన వారిలో కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి కాకినాడ డీఎస్పీ, ప్రస్తుతం భీమవరం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న వి.భీమారావు, వెయిటింగ్లో ఉన్న డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, అప్పట్లో సర్పవరం సీఐగా పనిచేసి ప్రస్తుతం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆకుల మురళీకృష్ణ, అప్పట్లో కేసు నమోదైన సర్పవరం స్టేషన్ ఎస్ఐగా ఉండి, ప్రస్తుతం కాకినాడ పోర్టు పోలీ్సస్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎన్.సతీష్ బాబు ఉన్నారు. ఈ పోలీసు అధికారులపై వెంటనే క్రమశిక్షణ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. విచారణ సజావుగా సాగేందుకు క్రమశిక్షణ ప్రొసీడింగ్స్ పూర్తయ్యే వరకు వీరి సస్పెన్షన్ కొనసాగుతుంది. వీరిపై హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తారు.
అనంతబాబుపై జగన్కు అమితమైన ప్రేమ: ఆనందబాబు
దళిత యువకుడిని అతికిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి రాజ్యాంగ పదవిని అప్పగించి, ఆ హంతకుడిని వెనకేసుకురావడం జగన్ నేర ప్రవృత్తికి నిదర్శనమని ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు మండిపడ్డారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వడం జగన్ పార్టీకి చెంపపెట్టు. ప్రశ్నిస్తే చంపడం, ఎదురొస్తే కారుతో తొక్కించడం జగన్ నైజం’ అంటూ ఆయన మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
విలువల వైతాళికుడు గజ్జెల: ఘంటా
శ్రీశైలంలో భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం