ఎన్టీఆర్ ఆశయాలే లక్ష్యంగా ట్రస్టు: భువనేశ్వరి
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:52 AM
ఎన్టీఆర్ ఆశయాలను ముం దుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఎన్టీఆర్ స్మారక ట్రస్టు పనిచేస్తోందని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ట్రస్టు 29వ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ ఆశయాలను ముం దుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఎన్టీఆర్ స్మారక ట్రస్టు పనిచేస్తోందని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు 29వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా శనివారం, ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనేశ్వరి మాట్లాడుతూ, ‘సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అన్నది ఎన్టీఆర్ నమ్మిన సిద్ధాంతం. దాతల నిరంతర సహకారంతో ట్రస్టు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించింది.
క్లిష్ట సమయాల్లో సామాజిక కార్యక్రమాలను ఎన్టీఆర్ ట్రస్టు విజయవంతంగా కొనసాగించింది. ఈ పరంపరలో మాకు మద్దతుగా నిలిచిన సంస్థలకు, వ్యక్తులకు మా కృతజ్ఞతలు. ట్రస్టు సిబ్బంది అంకితభావం నాకు గర్వకారణం. వారే ట్రస్టుకు బలం. నేనెప్పుడూ నా టీంను మరచిపోలేను. ఒక లీడర్కు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని ముందుకు తీసుకువెళ్లేది జట్టు సభ్యులే. నాయకత్వం అంటే అధికారం కాదని, బాధ్యత అని ఎన్టీఆర్ గట్టిగా విశ్వసించేవారు. సమాజంలో చివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ఆయన ఆకాంక్ష.
60 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్, ప్రజల కోసం ఎంతో శ్రమించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ట్రస్టు తన సేవలు కొనసాగిస్తోంది. ఇది ట్రస్టు మాత్రమే కాదు... విలువలతో కూడిన వ్యవస్థ. మార్పు చాలా అవసరం. మన యువశక్తి మన బలం. సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. వ్యాపారవేత్తగా కంటే, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే నాకు సంతోషంగా ఉంటుంది.’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి