విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎంపీ శబరి
ABN , Publish Date - May 06 , 2026 | 11:58 PM
సంచార, దళిత, పీడిత వర్గాల వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నంద్యాల ఎంపీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి అన్నారు.
నంద్యాల రూరల్, మే 6(ఆంధ్రజ్యోతి): సంచార, దళిత, పీడిత వర్గాల వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నంద్యాల ఎంపీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి అన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లోని బేడ, బుడగ విద్యార్థుల వసతి గృహంలో పదో తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బుధవారం ప్రోత్సాహక బహుమతులు, మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. బేడ, బుడగ జంగాల ఎస్సీ రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుసార్లు తీర్మానం చేసి పార్లమెంట్కు పంపించారని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని అనేక సార్లు గళమెత్తానని తెలిపారు. బిక్షాటన చేస్తూ విద్యకు దూరంగా ఉంటున్న విషయాన్ని గమనించిన సీఎం నంద్యాలలో ప్రత్యేకంగా అర్బన్ రెసిడెన్సీ వసతి కల్పించి విద్యాభివృద్ధి ప్రోత్సాహం అందించడం మంచి పరిణామం అని అన్నారు. వసతి గృహానికి 40 సెంట్ల స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. అలాగే ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయిస్తానని చెప్పారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్రెడ్డి, బుడగ జంగం రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు, సర్వశిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నిత్యానందరాజులు, కేంద్ర ఫుడ్ కార్పోరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.