ఉదారంగా రుణాలివ్వండి
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:26 AM
డ్వాక్రా సంఘాల తరహాలోనే రైతులకు ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. డ్వాక్రా సంఘాల మాదిరిగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలన్నారు.
ప్రైవేట్ వ్యక్తుల వద్ద తీసుకునే పరిస్థితి వద్దు
వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల్లో రుణాలు తీసుకునేలా ఉండాలి
డ్వాక్రాల తరహాలోనే రైతులకు ప్రోత్సాహం
ఎంఎ్సఎంఈ రంగానికి మరింత ఊతమివ్వాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యాపారులకు చేయూతనివ్వాలి
డ్వాక్రా సంఘాల ఖాతాలపై చార్జీలు తగ్గించండి
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
2 లక్షల కోట్ల రుణాల్లో 49 వేలకోట్లు రీ-షెడ్యూల్
దీనివల్ల 1,108 కోట్లు ఆదా అయ్యాయి
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు
ఎంఎ్సఎంఈలకు రూ.95,714 కోట్ల రుణాలు
‘సాగు’కు 2.96 లక్షల కోట్లు ఇచ్చాం: బ్యాంకర్లు
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలి. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలి. రాష్ట్రంలో అన్ని రంగాలూ అభివృద్ధి బాట పట్టాలంటే ఎంఎ్సఎంఈలను ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
- రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో
సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాల తరహాలోనే రైతులకు ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. డ్వాక్రా సంఘాల మాదిరిగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలన్నారు. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్లు ప్రోత్సాహం అందించాలన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సీఎం అధ్యక్షతన జరిగింది. దావోస్ పర్యటన ముగించుకుని ఉదయాన్నే రాష్ట్రానికి విచ్చేసిన చంద్రబాబు నేరుగా బ్యాంకర్లతో భేటీ అయ్యారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్షించారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు ఈ సందర్భంగా బ్యాంకర్లు వెల్లడించారు.
కౌలు రైతులకు రూ.1,490 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) రూ.95,714 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘ప్రజలకు భరోసా ఇచ్చేలా పాలన ఉండాలి. గత పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయి. ఎక్కువ వడ్డీలకు పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారు. క్రెడిబిలిటీ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చుకోవచ్చు. అందుకే క్రెడిబిలిటీకి, బ్రాండింగ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏపీలో రూ.2 లక్షల కోట్ల మేర రుణాలను రీ-షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశాం. ఇప్పటికే రూ.49 వేల కోట్ల రుణాలు రీ-షెడ్యూల్ చేశాం. రుణాల రీ-షెడ్యూల్ వల్ల రూ.1,108 కోట్ల మేర ఆదా చేసుకోగలుగుతున్నాం’ అని అన్నారు.
టిడ్కో ఇళ్లకు రుణాలు ఇవ్వాలి
‘ఎంఎ్సఎంఈలు, ఇతర కీలక రంగాలకు బ్యాంకర్ల సహకారం కావాలి. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎ్సఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వంతో పాటు బ్యాంకులు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రాథమిక రంగంతో పాటు పారిశ్రామిక, సేవారంగాలు కూడా అభివృద్ధి చెంది రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంఎ్సఎంఈలు ఆర్థికంగా ఎదిగేలా, మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. అప్పుడే అన్ని రంగాల్లో బడుగులూ ఎదుగుతారు. వారికి ప్రభుత్వం నుంచి చేయాల్సింది చేస్తున్నా. బ్యాంకర్ల నుంచీ సహకారం ఉండాల్సిందే. దీనివల్ల పేద-ధనికుల మధ్య తారతమ్యాలు పోతాయి. పీపీపీ ప్రాజెక్టులకు వీజీఎఫ్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానంతో ముందుకెళ్తున్నాం. సేవారంగం పుంజుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. పునరుత్పాదక ఇంధన రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్న విషయాన్ని బ్యాంకర్లు గుర్తించాలి. టిడ్కో ఇళ్లపై గత ప్రభుత్వ హామీ అమలు కాక లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లకున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకుంటాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. బ్యాంకర్లు కూడా సహకరించాలి. డ్వాక్రా సంఘాల బ్యాంక్ ఖాతాలపై 15 రకాల చార్జీలు వేస్తున్నారు. వీటిని తగ్గించాలి. భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. గత ప్రభుత్వం 22ఏ పేరుతో భూ వివాదాలు సృష్టించింది. ఇప్పుడు భూ రికార్డులకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం. క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నాం. బ్యాంకర్లు కూడా బ్యాంక్ ఖాతాలకు క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశంపై ఆలోచన చేయాలి. ఇకపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాలకు జిల్లా కలెక్టర్లను కూడా ఆహ్వానించండి’ అని సీఎం సూచించారు.
ఫైనాన్స్ సంస్థలకు కేంద్రం అమరావతి
‘రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నాం. బ్యాంకులు సహా వివిధ ఆర్థిక రంగ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు ఇటీవలే శంకుస్థాపన చేశాం. నిర్మాణాలు మరింత ఊపందుకుని త్వరితగతిన పూర్తి కావాలి’ అని చంద్రబాబు అన్నారు. స్టార్టప్ కంపెనీలకు చేయూతనిచ్చే అంశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకులు మద్దతు ఇస్తున్నట్లు బ్యాంకర్లు సీఎం దృష్టికితెచ్చారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయానికి యూనియన్ బ్యాంక్, రాజమండ్రి స్పోక్ హబ్కు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, విశాఖ స్పోక్ హబ్కు పీఎన్బీ, అనంతపురం స్పోక్ హబ్కు కెనరా బ్యాంక్, తిరుపతి స్పోక్ హబ్కు ఇండియన్ బ్యాంక్, విజయవాడ స్పోక్ హబ్కు హెచ్డీఎ్ఫసీ సహకరిస్తున్నట్లు వివరించారు. లీడ్ బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు సీఎ్సఆర్ నిధుల నుంచి రూ.10కోట్లు విరాళంగా ఇచ్చింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, సీఎస్ విజయానంద్, ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఐ, నాబార్డు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కూటమిని కూల్చడం ఎవరి తరం కాదు: పల్లా
విద్యుత్ చార్జీలు ట్రూ డౌన్ చేశాం