Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:15 AM
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కాణిపాక క్షేత్రానికి వేలాదిగా భక్తులు విచ్చేశారు. దాంతో స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది.
ఐరాల(కాణిపాకం), జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కాణిపాక క్షేత్రానికి వేలాదిగా భక్తులు విచ్చేశారు. దాంతో స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. ఆలయ మాడ వీధులన్నీ భక్తులతో కిక్కిరిశాయి. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో కొంతమేరకు ఇబ్బందులు తగ్గాయి. చిన్నారుల తల్లిదండ్రులకూ ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఇక చిన్నారులు తప్పిపోకుండా వారికి ప్యారెంట్ ట్యాగ్ను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదాలను భక్తులకు సిబ్బంది అందించారు.
స్వామి సేవలో ప్రముఖులు
పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు మురళీమోహన్, జగన్మోహన్, తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ వేణుగోపాలరావు కాణిపాక వరసిద్ధుడిని గురువారం దర్శించుకున్నారు. వీరిని చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను చేశారు. బోర్డు సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, కృష్ణవేణి, శివప్రసాద్, ఏఈవో రవీంద్రబాబు, ప్రొటోకాల్ ఏఈవో ధనపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్నాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.