Share News

వీఆర్వో ఆత్మహత్యపై నిరసన

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:49 PM

అధికారుల ఒత్తిళ్లతోనే కర్నూలులో వీఆర్‌వో హుస్సేన ఆత్మహత్య చేసుకున్నారని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన నాయకులు విమర్శించారు. వీఆర్వో ఆత్మహత్యకు నిరసనగా సోమవారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

వీఆర్వో ఆత్మహత్యపై నిరసన
Secretariat employees displaying oil lamps at the Ambedkar statue

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 8(ఆంధ్రజ్యోతి): అధికారుల ఒత్తిళ్లతోనే కర్నూలులో వీఆర్‌వో హుస్సేన ఆత్మహత్య చేసుకున్నారని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన నాయకులు విమర్శించారు. వీఆర్వో ఆత్మహత్యకు నిరసనగా సోమవారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వీఆర్‌వో ఆత్మకు శాంతికలగాలని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి, వినతిపత్రం అందజేశారు. సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ అధికారుల వేధింపులు, పనిఒత్తిడి భరించలేక కర్నూలు సచివాలయంలో వీఆర్‌వోగా పనిచేస్తున్న హుస్సేన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌ఓ మృతిపై పారదర్శకంగా విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ నాయకులు సుధాకర్‌, వీకే లక్ష్మీనారాయణ, మల్లికార్జున, వీరనారప్ప, హనుమంతు, చిన్నూరప్ప, శివశంకరయ్య, చంద్ర, వినయ్‌, బాలకృష్ణారావు, కళావతి, జ్యోతి, స్రవంతి, ప్రమీల, కవిత, మౌలాలమ్మ, ప్రభావతి పాల్గొన్నారు.

నార్పల: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలు పని ఒత్తిడి తగ్గించాలని సోమవారం నిరసన తెలిపారు. వీఆర్వో శివరాం మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని మహమ్మద్‌ హుసేన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఆదివారం అని చూడకుండా పని చేయించుకోవడం దారుణమన్నారు. పనిఒత్తిడి తగ్గించాలని ఆయన కోరారు.

Updated Date - Jun 08 , 2026 | 11:49 PM