అంబేడ్కర్ ర్యాలీని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:07 AM
అంబేడ్కర్ జయంతి ర్యాలీని అడ్డుకుని దళితులను కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేసారు. శుక్రవారం కనగానపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కనగానపల్లి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ జయంతి ర్యాలీని అడ్డుకుని దళితులను కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేసారు. శుక్రవారం కనగానపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకడు సాకే హరి మాట్లాడుతూ.. 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా కొండపల్లి గ్రామంలో దళితులు అధికారుల అనుమతితో ర్యాలీ నిర్వహించారన్నారు. అదే గ్రామానికి చెందిన కొప్పుల చంద్రశేఖర్రెడ్డితో పాటు మరికొందరు ర్యాలీని అడ్డుకుని కులం పేరుతో దూషించారన్నారు. దళిత సంఘాల నాయకులు శ్రీనివాసులు, కదిరప్ప, మూర్తి, ముత్యాలు, సాకే వన్నూరుస్వామి పాల్గొన్నారు.
చెన్పేకొత్తపల్లి: అంబేడ్కర్ జయంతి సందర్భంగా 14న కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో ఆయన చిత్రపటంతో చేపట్టిన ఊరేగింపును అడ్డుకున్న వారిని వెంటనే అరెస్టుచేయాలని అందరివాడు ఉత్సవ సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషనలో ఎస్ఐ సత్యనారాయణను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ప్రజాసంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా ఓ న్యాయవాదితోపాటు మరికొందరు ఊరేగింపును అడ్డుకుని కులంపేరుతో దూషిస్తూ అవమానించడం హేయమైన చర్య అన్నారు. ఉత్సవ సొసైటీ సభ్యులు ముత్యాలప్ప, రామకృష్ణ, శంకర్, గంగాధర్, ఆదినారాయణ పాల్గొన్నారు.