Srinivas Goud: కాంగ్రెస్ మాటలు బూటకం: శ్రీనివాస్గౌడ్
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:09 AM
కాంగ్రెస్ మాటలు బూటకమని, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీ నయవంచన చేసిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. ఆదివారం తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫార్ములా ఈ-రేస్ పేరిట కేటీఆర్పై చెత్త కేసు: ఆర్ఎస్ ప్రవీణ్
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ మాటలు బూటకమని, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీ నయవంచన చేసిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. ఆదివారం తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్న అధికారపార్టీ.. కేంద్రానికి బీసీ బిల్లు పంపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని సీఎం రేవంత్రెడ్డి కలిసినప్పుడు బీసీ బిల్లు చట్టబద్ధతగురించి ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇక చెత్త బుట్టలో పారేయాల్సిందేనా? ఏటా బడ్జెట్లో బీసీలకు రూ.20 వేలకోట్లు పెడతామని మాట తప్పారని, బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత ఏదని ఆయన నిలదీశారు.
ఏ ముఖం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందో చెప్పాలన్నారు. కేటీఆర్పై కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఆయనపై పెట్టిన ఫార్ములా ఈ-రేస్ కేసు ఒక చెత్త కేసని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. తన 26 ఏళ్ల పోలీసు సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కేటీఆర్పై ఇప్పటివరకు 14 కేసులు పెడితే.. అందులో నాలుగు కేసులను హైకోర్టు కొట్టేసిందని తెలిపారు. చట్ట ప్రకారం పోలీసులు నడుచుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలపై పెట్టే కేసులకు ఎఫ్ఐఆర్లు గాంధీభవన్లో సిద్ధం చేస్తున్నారని.. తమ పార్టీ నాయకులపై పెడుతున్న కేసులన్నీ తప్పుడు కేసులేనన్నారు.